ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ఏడుగురిని బలిగొన్న ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం

Last Updated : Jun 24, 2018, 06:20 PM IST
ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ఏడుగురిని బలిగొన్న ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ హెటెక్ బస్సు వేగంగా ఢీకొన్న దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులంతా కోడుమూరు మండలం అల్లపాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. బాధితులంతా అల్లపాడు నుంచి నాటు వైద్యం కోసం మూడు ఆటోల్లో మహానందికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆటో సోమయాజులపల్లె వద్దకు చేరుకున్న సమయంలో రెండు ఆటోలు ముందు వెళ్లగా మూడో ఆటోను ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 13 మంది ఉండగా వారిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో శవాలు పడి ఉన్న తీరు భీకర దృశ్యాన్ని తలపించింది. ఘటనాస్థలంలో మృతుల బంధువులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారిని కల్లపాడు సర్పంచ్ గౌరమ్మ, బోయ లక్ష్మీదేవి, ఈరమ్మ, మారెప్ప, చనుగొండ్ల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, హుస్సేనమ్మ, గూడూరు గ్రామానికి చెందిన ఈరమ్మగా గుర్తించారు. ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రులు వెల్లడించిన సమాచారం మేరకు హైటెక్ బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. 

Trending News