టాలీవుడ్ vs టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్..

టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, సినీనటుడు పోసాని కృష్ణమురళి వెల్లడించిన అభిప్రాయాల్లో మీ ఓటు ఎవరికి ? 

Last Updated : Mar 22, 2018, 07:51 PM IST
టాలీవుడ్ vs టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్..

ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో సినిమా వాళ్లు పాల్పంచుకోవడం లేదని ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. తమిళనాడులో జల్లికట్టు కోసం అక్కడి తమిళ సినీ నటులు అంతా ఏకమై పోరాటం చేశారని, కానీ ఇక్కడ తెలుగు నాట అలా జరగడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన రాజేంద్ర ప్రసాద్.. తమిళ సినీ నటులకు వున్నంత తెగువ తెలుగు సినీ ప్రముఖులకు లేదని అన్నారు. అంతేకాకుండా తమిళ నటులని చూసైనా తెలుగు సినిమా వాళ్లు నేర్చుకోవాలని పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజేంద్ర ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనియాంశమైన నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమపై వస్తోన్న ఆరోపణలపై స్పందించిన ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి.. ఏ నాయకుడి పేరు ఎత్తకుండానే గట్టి కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. అధికారంలో వుంటూ రాజకీయ నాయకులు చేయాల్సిన పనిని చేయకపోగా.. పైగా సినిమా వాళ్ల మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని పోసాని మండిపడ్డారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సైతం సినిమా వాళ్లపై వస్తోన్న ఆరోపణలను అంతే గట్టిగా తిప్పి కొట్టారు.  

ఇదిలావుంటే, ఎవ్వరి పేరుని ప్రస్తావించకుండా సినిమా వాళ్లపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు, అదే విధంగా రాజకీయ నాయకుల పేర్లను ప్రస్తావించకుండా నాయకులని లక్ష్యంగా చేసుకుని పోసాని కృష్ణమురళి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనియాంశమయ్యాయి. ఈ అంశంపై ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు, చోటుచేసుకుంటున్న నాటకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను పంచుకున్న పోసాని.. రాజకీయ నాయకులు చేయాల్సిన పనిని సినిమా వాళ్లపై తోసేసి, వాళ్లు సేఫ్ సైడ్‌లో వుండాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ఈ మొత్తం వ్యవహారంపై ప్రజాభిప్రాయం ఏంటి ? రాష్ట్రం కష్టాల్లో వున్నప్పుడు సినిమా వాళ్లు అండగా నిలవడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో జనం ఏకీభవిస్తారా ? లేకపోతే జనం ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు బాధ్యతతో చేయాల్సిన పనిని సినిమా వాళ్లపై నెట్టేసి, తద్వారా వచ్చే ఉద్యమంతో టీడీపీ లబ్ధి పొందాలని చూస్తోంది అని పోసాని చేసిన వ్యాఖ్యల్లో నిజం వుందంటారా ? ఈ ఇరువురి వాదనపై మీ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నమే ఇదిగో ఇక్కడ జీ న్యూస్ తెలుగు నిర్వహిస్తున్న ఈ పోలింగ్. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, సినీనటుడు పోసాని కృష్ణమురళి వెల్లడించిన అభిప్రాయాల్లో మీరు ఎవరికి ఓటేస్తారు ? 

 

Trending News