సంక్రాంతి సందర్భంగా అందరికీ గుర్తుకువచ్చే కోడిపందేలు.. రంగవల్లులతో పాటు బాలలకు ప్రత్యేకమైన మరో ఉత్సవం కూడా ఉంది. అదే 'గాలిపటాల ఉత్సవం'. సంక్రాంతి సందర్భంగా అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాన్ని నిర్వహించడం తెలంగాణలో ఆనవాయితీగా వస్తోంది. ఆ విశేషాలేమిటో మనం కూడా తెలుసుకుందాం
*ప్రతీ యేటా 'అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం' పేరుతో పతంగుల పండగను జరపడం తెలంగాణలో ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా ఒక ప్రత్యేకమైన థీమ్తో 'గాలిపటాల ఉత్సవం' ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా జనవరి 13 నుండి 15 వరకు ఈ ఉత్సవాన్ని హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరపనున్నారు.
*బాలికా విద్యకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో అదే అంశాన్ని థీమ్గా తీసుకొని ఈ సంవత్సరం 'అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం' నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. "అమ్మాయిలను చదివిద్దాం.. వారే ప్రపంచగతిని మారుస్తారు" అనే నినాదంతో ఈ సంవత్సరం ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు.
*ఎవరెస్టు శిఖరాన్ని అతి పిన్నవయసులోనే అధిరోహించిన మలావత్ పూర్ణ ఈ సంవత్సరం అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు.
*ఈ గాలిపటాల ఉత్సవం సందర్భంగా గాలిపటాలను ఎగురవేసే పోటీలను కూడా నిర్వహిస్తారు. అందులో మన రాష్ట్రం మాత్రమే కాకుండా.. భారతదేశంలోని వేరే రాష్ట్రాలు, ఇతర దేశాల కైట్ ఫ్లయర్స్ కూడా పాల్గొంటారు.
*అలాగే ఈ కైట్ ఫెస్టివల్లో వివిధ దేశాలకు చెందిన గాలిపటాలను కూడా ప్రదర్శనకు ఉంచుతున్నారు. అలాగే కైట్ మేకింగ్ వర్కుషాపులు కూడా నిర్వహించనున్నారు.
*గతేడాది నిర్వహించిన గాలిపటాల ఉత్సవాల్లో రిమోట్తో గాలిపటాలను ఎగురవేసి అందరినీ ఆశ్చర్యపరిచారు కొందరు కైట్ ఫ్లయర్స్.