లక్షాధికారి కావడానికి గర్భిణీ స్త్రీని బలిచ్చాడు..! స్వామిజీ మాటలు పాటించిన ప్రబుద్ధుడు

పుదుచ్చేరిలో ఈ రోజు ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ స్వామిజీ మాటలు విని ఒక ప్రబద్ధుడు మూఢ నమ్మకంతో గర్భంతో ఉన్న భార్యనే బలిచ్చాడు.

Last Updated : Sep 24, 2018, 06:36 PM IST
లక్షాధికారి కావడానికి గర్భిణీ స్త్రీని బలిచ్చాడు..! స్వామిజీ మాటలు పాటించిన ప్రబుద్ధుడు

పుదుచ్చేరిలో ఈ రోజు ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ స్వామిజీ మాటలు విని ఒక ప్రబుద్ధుడు మూఢ నమ్మకంతో గర్భంతో ఉన్న భార్యనే బలిచ్చాడు. తర్వాత ఏమీ తెలియనట్లు తన భార్య కనిపించడం లేదని లోకల్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో నిందితుడి తెలివితేటలకు పోలీసులే ఆశ్చర్యపోయారు. తానే తన భార్య గొంతు కోసి తుప్పల్లో పడేసి.. ఏమీ ఎరగనట్టు వచ్చి పోలీసులకు నిందితుడు ఫిర్యాదు చేయడంతో వారు విస్తుపోయారు. తొలుత నిందితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. బాధితురాలి జాడ కనుగొనడానికి ప్రయత్నించిన పోలీసులకు ఊరి శివార్లలో ఆమె దేహం కనిపించింది.

వారికి అది అనుమానాస్పద మరణంగా తోచింది. వివిధ కోణాల్లో ఆలోచించి.. ఆఖరికి ఆమె భర్తపైనే నిఘా వేసి వారు అసలు విషయం కనుగొన్నారు. అతడికి మూఢ నమ్మకాలు ఎక్కువనే విషయం తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఎంక్వయరీలో భాగంగా తనను కూడా అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. ఓ స్వామిజీ ఇచ్చిన సలహా మేరకు తాను ఇంత దారుణానికి పాల్పడినట్లు తెలిపాడు. 

ఈ దారుణానికి పాల్పడిన ఘటనలో తాను మరో అయిదుగురు వ్యక్తుల సహాయం తీసుకున్నట్లు నిందితుడు తెలిపాడు. వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే గర్భిణీ స్త్రీని బలివ్వాలని సలహా ఇచ్చిన స్వామిజీ జాడ కూడా కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో మరణించిన బాధితురాలికి, నిందితుడికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతకొంత కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న నిందితుడు ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే స్వామిజీని ఆశ్రయించి ఆయన సలహా మేరకు ఈ హత్యకు పాల్పడ్డాడు. 

Trending News