సోషల్ మీడియా వచ్చాక సమాచారం చేరవేయడం వేగవంతమయ్యింది. అయితే అలా వచ్చిన సమాచారాల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోకుండా పత్రికల్లో, వెబ్ సైట్లలో వార్తలు పోస్టు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.. 2017లో కూడా అలాంటి వార్తలే ఆన్లైన్లో తెగ హల్ చల్ చేశాయి.అందరూ ఆ వార్తలను చూసి నిజమే అనుకున్నారు. కానీ నిజం తెలుసుకొని అది ఫేక్ వార్త అని నిర్ధారణకు వచ్చారు.
హైలెట్ ఏమిటంటే ఈ ఏడాది విరాట్- అనుష్కల వివాహం గురించి వార్తలు వచ్చినప్పుడు... అందరూ ఈ పెళ్లి ఊహాగానమే అని.. ఇలాంటి వార్తలు చాలానే విన్నాం అని వదిలేశారు. తీరా డిసెంబర్ 12 వస్తే గానీ తెలియలేదు. ఈ వార్త నిజమని. అయితే నిజమనుకున్న వార్తలు అబద్ధమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని మీకోసం..!
ఈ ఏడాది బాగా పాపులర్ అయిన ఫేక్ న్యూస్
1. ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల కుమారుడు ఆకాష్ అంబానీ వివాహం గురించి ఓ వార్త బాగా వైరల్ అయ్యింది. ఇదిగో వీరి పెళ్లి పత్రిక అంటూ ఒక వార్త వీడియా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది. బంగారు రేకుతో ఆహ్వాన పత్రికలు పంచారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఇదంతా అవాస్తవమని ఆ తర్వాత అంబానీ కుటుంబం చెప్పింది.
2. ఏంజెలీనా జోలీగా మారడానికి 50 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందంటూ ఒక యువతి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే అందంతా ఫేక్ న్యూస్. తన ముఖాన్ని ఫోటో షాప్లో అలా చేశానని.. అయితే పనిగట్టుకొని దాన్ని వేరేలా ప్రచారం చేశారని ఆ యువతి పేర్కొంది.
3. యూపీలోని బోధిలో ముస్లింలు స్వామి వివేకాంద విగ్రహంపై దాడి చేసి తలను పగులగొట్టారని వార్త ఒకటి హల్ చల్ చేసింది. దీంతో యూపీలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అప్పటికే జరగాల్సిందల్లా జరగగా.. చివరకు ఆ వార్త ఒట్టిదేనని కొట్టిపారేశారు.
4. దీపావళి రోజున ఇండియా ఎంత అద్భుతంగా ఉందో చూడండంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఆ ఫోటోను నెల రోజుల క్రితమే.. రాత్రిపూట శాటిలైట్ ద్వారా తీసిన ఛాయాచిత్రం అని తేలింది.
5. పాకిస్థాన్ రిపోర్టర్ ఓ ఛానల్కు లైవ్ ఇస్తూ క్రేన్ మీద నుంచి క్రింద పడిపోయింది. అయితే.. ఆమె చనిపోయిందని చాలా ఫేక్ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఆమె బతికి ఆరోగ్యంగానే ఉంది.
6. వైజాగ్ సముద్ర తీరానికి సాగర కన్య కొట్టుకువచ్చిందని ఒక వీడియో తెలుగు రాష్ట్రాల్లో వైరలయ్యింది. కానీ అది మయన్మార్కు చెందిన ఒక కళాకారుడి అద్భుత సృష్టి అని తెలుసుకొని.. అరెరే నిజం ఏంటో తెలుసుకోకుండా పోస్టు చేస్తున్నామే అని నెటిజన్లు ఫీలయ్యారు.
7. అనారోగ్య కారణాలతో శశి కపూర్ మరణించాక, ఒక ప్రముఖ టీవీ ఛానల్ సానుభూతి తెలుపుతూ ఒక ప్రకటనను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే అందులో శశికపూర్ పేరుకు బదులు శశి థరూర్ పేరును తప్పుగా పోస్టు చేసింది. తరువాత నిజం తెలుసుకొని పోస్టును తొలగించింది.
8. జయలలితను శశికళగా పొరబడి పాకిస్థాన్ రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ "శశికళ అనే దక్షిణ భారతీయ నటీమణి మరియు రాజకీయవేత్త ఇటీవలే మరణించారు. ఆమె మరణించాక తన ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు వస్తువులతో పాటు డబ్బు కూడా దొరకడం గమనార్హం. అవినీతిపరులైన నాయకులు అందరికీ ఇదే నా సందేశం" అని చెప్పి వార్తల్లో నిలిచాడు. " పక్క దేశాల రాజకీయాలు నీకెందుకు? ముందు నీ దేశ రాజకీయాల మీద అవగాహన తెచ్చుకో" అంటూ సెటైర్లు వేశారు నెటిజన్లు. అలాగే అవగాహన లేని వార్తలు రాయవద్దని ఆయనకు హితవు కూడా చెప్పారు.