మెరిసిన సింధు.. తొలిసారి సెమీఫైనల్లోకి

ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌ 2018లో భారత్‌కు పతకం ఖాయమైంది.

Last Updated : Mar 17, 2018, 01:22 PM IST
మెరిసిన సింధు.. తొలిసారి సెమీఫైనల్లోకి

బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు పతకం ఖాయమైంది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్, తెలుగు తేజం పీవీ సింధు సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. శుక్రవారం హోరా హోరిగా జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నోజోమి ఓకుహరపై పీవీ సింధు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సింధు 20-22, 21-18, 21-18 తేడాతో ప్రత్యర్థిపై గెలుపొంది సెమీఫైనల్‌కు చేరుకుంది.

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో మొదటి గేమ్‌లో సింధు 20-22 స్కోరుతో చేజార్చుకుంది. రెండో గేమ్‌ను 21-18 స్కోరు తేడాతో గెలిచి స్కోరును 1-1తో సమం చేసింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రత్యర్థి ఒకుహరా పీవీ సింధును ఒకింత ఇబ్బంది పెట్టే యత్నం చేసినా.. సింధు దానిని అధిగమించి గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ గెలిచింది. ఫలితంగా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో తొలిసారి సింధు సెమీస్‌లోకి ప్రవేశించి కొత్త చరిత్ర సృష్టించింది.

శ్రీకాంత్ కు నిరాశ

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ నుంచి భారత బాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ పరాజయంతో వెనుదిరిగాడు. ప్రీక్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన హుయాంగ్ చేతిలో 11-21, 21-15, 20-22 తేడాతో ఓడిపోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో శ్రీకాంత్ 20-18తో విజయానికి చేరువగా వచ్చినా.. వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోవడంతో టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించాడు.

Trending News