మంత్రి కేటీఆర్‌కి మాజీ మంత్రి జానా రెడ్డి వార్నింగ్!

మంత్రి కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తంచేసిన సీఎల్పీ నేత జానా రెడ్డి

Last Updated : Aug 16, 2018, 09:46 PM IST
మంత్రి కేటీఆర్‌కి మాజీ మంత్రి జానా రెడ్డి వార్నింగ్!

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై సీఎల్పీ నేత జానా రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకనైనా కేటీఆర్‌ తన మాట తీరు మార్చుకోకపోతే రానున్న కాలంలో తెలంగాణ ప్రజలే అయనకు బుద్ధి చెబుతారని జానా రెడ్డి హెచ్చరించారు. గురువారం మీడియాతో మాట్లాడిన జానా రెడ్డి.. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చకుండా అప్పుడే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఎందుకు భావిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సర్కార్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఐదేళ్లు ఉండాల్సిన ప్రభుత్వానికి అప్పుడే ఏం ఆపద వచ్చిందో చెప్పాలని జానా రెడ్డి ఎద్దేవా చేశారు. 

సీఎం కేసీఆర్ తన మంత్రులకు ఎలా మాట్లాడాలో హితవు పలకాల్సిన అవసరం ఉందన్న జానా రెడ్డి... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్ సభ్యత్వాల పునరుద్ధరణపై హై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలా కోర్టు తీర్పును గౌరవించనందుకే స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి కోర్టు నుంచి నోటీసులు అందుకున్నారని జానా రెడ్డి ప్రభుత్వానికి హితవు పలికారు. తగిన సమయం, సందర్భం వచ్చినప్పుడు ప్రతిపక్షాల విమర్శలకు తనదైన స్టైల్లో జవాబిచ్చే మంత్రి కేటీఆర్.. జానా రెడ్డి వ్యాఖ్యలపై ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.

Trending News