ఆ రోజు తెలంగాణ భవన్‌కు రండి.. ఎన్నికలపై చర్చిద్దాం: కేసీఆర్

ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తెలంగాణ భవన్‌కు తప్పనిసరిగా రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. 

Last Updated : Oct 19, 2018, 09:56 PM IST
ఆ రోజు తెలంగాణ భవన్‌కు రండి.. ఎన్నికలపై చర్చిద్దాం: కేసీఆర్

ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తెలంగాణ భవన్‌కు తప్పనిసరిగా రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. అక్కడ జరిగే సమావేశంలో పార్టీ ప్రచార వ్యూహాలను చర్చిస్తారని వార్తలు వస్తున్నాయి.  ఇటీవలే అసెంబ్లీని రద్దు చేసిన తరుణంలో టీఆర్ఎస్ పార్టీశ్రేణులకు అధిష్టానం ప్రచార సామగ్రిని కూడా అందించింది. అదేవిధంగా.. వివిధ జిల్లాల్లో పార్టీ పురోగతిపై కూడా స్వయంగా ముఖ్యమంత్రే సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ పథకాలను జనాల్లోకి విరివిగా  తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించాలని కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు సూచిస్తున్నారు.

అదేవిధంగా సోషల్ మీడియా టీమ్‌తో కూడా స్వయంగా కేసీఆర్,  కేటీఆర్ మొదలైన నేతలు మాట్లాడి.. ఆన్ లైన్‌లో విరివిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపినట్లు సమాచారం. అలాగే టీఆర్ఎస్ నుండి బరిలోకి దిగే అభ్యర్థులు కూడా ఎలా ప్రణాళికాబద్ధంగా నడుచుకోవాలి? ప్రజలతో ఎలా మమేకం అవ్వాలన్న అంశంపై  కూడా పార్టీ నాయకులు పలు సూచనలు చేస్తున్నారు. ఈ విషయమై సీఎంకు ఎప్పటికప్పుడు నివేదికలు కూడా పంపిస్తున్నట్లు సమాచారం. 

ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తన పార్టీ శ్రేణుల కోసం తెలంగాణ భవన్‌లో మళ్లీ సమావేశం నిర్వహించడానికి పూనుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే సమావేశంలో ఎవరైనా పార్టీ నాయకుల్లో టికెట్ల విషయంలో అసంతృప్తి ఉంటే.. అటువంటి సమస్యలను కేసీఆర్ స్వయంగా పరిష్కరించడానికి కూడా పూనుకొనే అవకాశం ఉందని.. జిల్లా నేతలతో ఆయన స్వయంగా మాట్లాడే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. పార్టీ నుండి వలసలను నివారించడానికి కూడా ఈ సమావేశాన్ని ప్రధాన ఎత్తుగడను ఉపయోగించనున్నారని కూడా పలువురు రాజకీయ ప్రముఖులు అంటున్నారు. 

Trending News