ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత యాక్టీవ్ పొలిటిషియన్ రమేష్ రాథోడ్ కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా సమక్షంలో తన అనుచరగణంతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఖానాపూర్ టికెట్ ను తనను కాదని రేఖా నాయక్ కు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తికి లోనైన రమేష్ రాథోడ్ పార్టీ ఫిరాయించినట్లు తెలిసింది.
టీడీపీలో ఎంపీగా పనిచేసిన రమేష్ రాథోడ్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం టీడీపీకి గుడ్ బై చెప్పి.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే వ్యవధిలో ఆయన పార్టీలో ఇమడలేకపోయారు. చివరకు తాను కోరిన ఖానాపూర్ టికెట్ ను టీఆర్ఎస్ నిరాకరించడంతో ఇలా కాంగ్రెస్ లో చేరారు రమేష్ రాథోడ్. రమేష్ రాకతో ఆదిలాబాద్ లో పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు