SVSN Varma News Updates: ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారయ్యారు. మొత్తం ఐదు సీట్లకు గానూ టీడీపీకి మూడు సీట్లు, జనసేనకు ఒకసీటు.. బీజేపీకి ఒకసీటు దక్కాయి. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పక్కన పెట్టేసినా సీఎం చంద్రబాబు.. కొత్త ముఖాలకే చాన్స్ ఇచ్చారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కమార్తె గ్రీష్మకు చాన్స్ ఇచ్చారు. మరో రెండు సీట్లను బీదా రవిచంద్ర, బీటీ నాయుడుకి కేటాయించారు. ఇక జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజుకు అవకాశం కల్పించారు. అయితే టీడీపీ నుంచి ఎమ్మెల్సీ సీటును ఆశించిన కొందరు సీనియర్లు పార్టీ హైకమాడ్ తీరుపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పిఠాపురం టీడీపీ రీజినల్ కో ఆర్డినేటర్ ఎస్వీఎస్ఎన్ వర్మకు సీఎం చంద్రబాబు మరోసారి గట్టి షాక్ ఇచ్చారు..
ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పాటై ఏడాది కావొస్తోంది. ఎన్నికల సమయంలో పిఠాపరం ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వర్మకు టికెట్ దక్కలేదు.. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో.. వర్మ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు.. త్వరలోనే మంచి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పటికే అనేకమార్లు పదవులు భర్తీ జరిగినా.. వర్మకు మాత్రం ఎలాంటి పోస్టు దక్కలేదు.. చివరకు ఎమ్మెల్సీ సీటు అయినా దక్కుతుందని ఆశపడిన వర్మకు మరోసారి నిరాశే ఎదురైంది.
ప్రస్తుతం పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ.. టీడీపీకి పెద్దదిక్కులా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో ఓటమి చెందాక.. కూడా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. 2019-2024 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం ఆయనపై ఎన్నో కేసులు పెట్టింది. అయినా తట్టుకుని నిలబడ్డారు. అటు నిమ్మకాయల చిన్న రాజప్ప వంటి సీనియర్లు సైతం ఎమ్మెల్యేగా ఉండి సైలెంట్ అయినా వర్మ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే ఇన్నాళ్లు ఎదురు చూసిన వర్మకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంతా భావించారు. కానీ వర్మకు షాక్ ఇస్తూ.. ఇతర నేతలను హైకమాండ్ ఎంపిక చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..
అయితే తనకు ఎమ్మెల్సీ సీటు దక్కలేదని తెలియడంతో.. తీవ్ర నిరాశలో మునిగిన వర్మ.. క్షణం కూడా విజయవాడ నుంచి వెనుతిరిగారు. ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ సీటు రాకపోవడంతో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్పై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ కోసం త్యాగం చేసిన తనకు తగిన శాస్తి జరిగిందని అనుచరులు దగ్గర వాపోయారని సమాచారం. అయితే వర్మ టీడీపీని వీడుతారనే ముందుస్తు సమాచారంతో టీడీపీ హైకమాండ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎస్వీఎస్ఎన్ వర్మతో టీడీపీ అగ్రనేతలు బుజ్జగించినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ పెద్దల సలహాతో వర్మ దిగివచ్చి సమాచారం. ఇందులో భాగంగా పిఠాపురంలోని తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. పదవి ఇవ్వాలంటే కొన్ని కూడికలు, ప్లస్లు, మైనస్లు చూడాల్సి వస్తోందన్నారు.
ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తోంది. ఇంతకీ టీడీపీలో వర్మకు పోస్టు దక్కుతుందా అనేది చూడాల్సి ఉంది. ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పంపిస్తారనే ప్రచారం సాగుతున్నా.. అది కూడా ఫలించేటట్లు లేదు. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ తో తలనొప్పి తెచ్చుకోవడం చంద్రబాబుకు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. పిఠాపురంలో రెండవ అధికార కేంద్రం ఉండకూడదనే ఉద్దేశంతోనే వర్మను పక్కన పెట్టేసినట్లు సమాచారం. మొత్తంగా ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో.. తీవ్ర అసంతృప్తి మీదున్న వర్మ.. పార్టీ పెద్దలకు ఓకే అని పైపైకి చెబుతున్నా.. లోలోన మాత్రం.. తీవ్రంగా రగిలిపోతున్నట్టు సమాచారం. మరోవైపు వర్మకు కూటమిలో జరుగుతున్న అన్యాయాన్ని వైసీపీ నేతలు కూడా క్యాచ్ చేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
Also Read: TGPSC Group 1 Results: టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోవడం ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









