)
Illegal Real Ventures: అమరావతి నిర్మాణ పనులు ఊపందుకోవడంతో రియల్ ఎస్టేట్ వెంచర్లు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో బ్రోచర్లు, కరపత్రాలతో హడావిడి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా బ్రోచర్లు ప్రకటనలు చూసి కొనవద్దని సీఆర్డీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. లేదంటే నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉంది.
ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి పనులు మరోసారి పట్టాలెక్కడంతో రియల్ ఎస్టేట్ పుంజుకుంటోంది. వీటిలో కొన్ని సక్రమమైనవి కాగా అధిక శాతం అక్రమంగా పుట్టుకొచ్చినవే ఉంటున్నాయి. సీఆర్డీఏ అప్రూవల్ అంటూ బ్రోచర్లతో హడావిడి ప్రకటనలు చేస్తూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తే చాలు 2-3 అడుగులలోతు నీళ్లు చేరుతుంది. అంతేకాకుండా వాగుల నుంచి వరద నీరు పొంగి ముంచెత్తుతుంటుంది. పొలాల్లో కూడా రోజుల తరబడి నీళ్లు చేరి పంటలు కూడా సరిగ్గా పడవు. ఇలాంటి భూముల్ని కొనుగోలు చేసి వెంచర్లుగా మార్చేస్తున్నారు. పల్నాడు జిల్లాలోని అమరావతి, పెదకూరపాడుతో పాటు గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలాల్లో వాగు ముంపు పరిధిలో వందల ఎకరాల్లో ఇలాంటి వెంచర్లు వస్తున్నాయి. ఈ భూముల అసలు పరిస్థితి తెలియాలంటే వర్షాలు సమృద్ధిగా పడేటప్పుడు వెళ్లి పరిశీలించాలి. ఆ విషయం తెలియక వేసవి సమయంలో ఆ భూముల్ని చూసి కొనుగోలుదారులు విక్రయాలు జరుపుతున్నారు.
కాల్వలు, వాగులు, వంకలు ఆక్రమించి వాటిని చదును చేసి వెంచర్లు చేసేస్తున్నారు. దాంతో వర్షాలొచ్చనప్పుడు ఆ నీరంతా వెళ్లే మార్గం లేక చుట్టుపక్కల పంట పొలాల్ని ముంచెత్తుతోంది. ఇలాంటి భూములు ఎక్కడెక్కడున్నాయో మీకు అవగాహన కోసం కొన్ని వివరాలు అందిస్తున్నాం. అమరావతి మండలంలోని అమరావతి, లింగాపురం, పెదమద్దూరు, నరుకుళ్లపాడు, ముత్తాయపాలెం, యండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాల్లో వాగు ముంపు ప్రాంతంలో వెంచర్లు వెలిశాయి. లింగాపురంలో గత ప్రభుత్వం జగనన్న కాలనీసకు ప్లాట్లు కేటాయిస్తే ముంపు ప్రాంతమనే కారణంగా లబ్దిదారులు ఆసక్తి చూపించలేదు. దాంతో అవి కాస్తా రద్దయ్యాయి. ఇప్పుడు అదే ప్రాంతంలో వెంచర్లు వేశారు.
ఇక బలుసుపాడు, యండ్రాయి, పెదమద్దూరూ గ్రామాల్లో లే అవుట్లకు వరద నీరు పోటెత్తకుండా నిర్మించిన ప్రహారీ గోడలు కూలిపోయాయి. ఇక పెదకూరపాడు మండలం బలుసుపాడు పరిధిలో వెలిసిన 100 ఎకరాల లే అవుట్ల్లో సగానికి పైగా వరద ముంపు ప్రాంతమే కావడం గమనార్హం. తాడికొండ గ్రామంలో కూడా ఇదే పరిస్థితి కన్పిస్తోంది. కొండవీటి వాగు వెంబడి వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు. ఇలా ముంపు ప్రాంతాల్లో వందలాది వెంచర్లు వస్తున్నాయి. పూర్తిగా పరిశీలించకుండా ఇవి కొనుగోలు చేస్తే మోసపాతారు జాగ్రత్త. అందుకే అమరావతి ప్రాంతంలో భూములు కొనేముందు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుంటే మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి