Pithapuram Development: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కల్యాణ్ ఎన్నికైనప్పటి నుంచి పిఠాపురం పై అందరి దృష్టి పడింది. పిఠాపురంలో ఏ చిన్న పరిణామం జరిగినా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఉప ముఖ్యమంత్రి కూడా కావడంతో పిఠాపురానికి పవన్ కల్యాణ్ వరంగా మారారు. అభివృద్ధి జాతర.. నిధుల వరద పారుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పిఠాపురం నియోజకవర్గానికి భారీగా అందుతున్నాయి. ఆయన ఏదైనా మాటిస్తే కచ్చితంగా అమలు చేస్తారనే గుర్తింపు లభిస్తోంది. తాజాగా మరో మాటను నిలబెట్టుకోవడంతో ఆ వార్త ఏపీలో చర్చనీయాంశంగా మారింది. అదేమిటో..? ఏం జరిగిందో తెలుసుకుందాం..
2020 డిసెంబర్ 25న అప్పటి పిఠాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నేటి జనసేన పార్టీ నాయకుడు పెండెం దొరబాబు జగనన్న కాలనీ కోసం పట్టాలు అందజేశారు. పంటపొలాల మధ్య ఇళ్లస్థలాలు కొనుగోలు చేసి పంపిణీ చేశారు. దాదాపు 1,600 మందికి స్థలాలు ఇచ్చారు. అక్కడ దాదాపు 800 మంది పైగా ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే కాలనీకి.. రహదారికి మధ్య సుద్దగడ్డ కాలువ సమస్యగా మారింది. భారీ వర్షాలు వచ్చినా.. ఏరు పొంగినా.. వాగులు వంకలు భారీగా ప్రవహిస్తే ఈ కాలువ వరదతో నిండి పొంగి ప్రవహిస్తుంది. ఆ సమయంలో కాలనీకి.. ప్రధాన రహదారికి రాకపోకలు నిలిచిపోతాయి. ఇళ్లు కట్టుకోకపోతే స్థలం రద్దు చేస్తామని అప్పట్లో అధికారులు హెచ్చరించరించడంతో అప్పు చేసి ఇళ్లు కట్టుకున్నవారు ఇప్పుడు ఇబ్బందుల్లో పడుతున్నారు. వర్షం వస్తే లోపల ఇరుక్కుపోయి బాహ్య ప్రపంచంతో వీరికి సంబంధాలు తెగి పోతాయి. పాములు ఇళ్లలో చేరుతాయి. తాగేందుకు నీరు కూడా ఉండదు. దాదాపు వారం రోజుల పాటు ఆ కాలువలో నీరు పూర్తిగా లాగే వరకు ఇదే పరిస్థితి ఉంటుంది.
ఈ విషయం పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. ఆయన గెలిచిన తర్వాత రెండు సార్లు కాలనీ వరదలో మునిగిపోయింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పవన్ కల్యాణ్ గత ఏడాది చివరలో సుద్దగడ్డ పొంగినప్పుడు కాలనీని సందర్శించారు. బోట్లు వేసుకుని కాలనీకి వెళ్లారు. ఆ సమయంలో వారికి పవన్ కల్యాణ్ బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మీ కాలనీకి వస్తానన్నారు. అన్నట్టుగానే ఈ బ్రిడ్జి నిర్మాణానికి కోట్ల రూపాయలు మంజూరు చేశారు. నిధులు మంజూరవడంతో బ్రిడ్జి పనులు మొదలయ్యాయి. దీంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన హామీ నెరవేర్చుకోవడంతో జగనన్న కాలనీ ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









