)
Education Loan Subsidy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగించేటప్పుడు ఎదుర్కొనే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలపై 4 శాతం వడ్డీ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు.
ఈ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పీఎం విద్యా లక్ష్మి విద్యా రుణ పథకానికి అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం కేంద్రం ఈ పథకం కింద రూ. 7.5 లక్షల వరకు రుణం ఇస్తోంది. ఎటువంటి హామీ లేకపోయినా విద్యార్థులకు ఈ రుణం లభిస్తుంది. అలాగే 3 శాతం వడ్డీ సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. ఇప్పుడు రాష్ట్రం అదనంగా 4 శాతం వడ్డీ సబ్సిడీ ఇస్తే, విద్యార్థులకు రుణ భారం చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఉన్నత విద్యను ఎంచుకోవడంలో విద్యార్థులు స్వేచ్ఛగా ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడుతుంది.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎన్ని సంవత్సరాలు చదువుకున్నా ఇబ్బంది లేకుండా రుణం పొందే అవకాశం ఉంటుందని, ఉద్యోగం వచ్చిన తర్వాత 14 సంవత్సరాల్లోపు రుణాన్ని తిరిగి చెల్లించవచ్చని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం విద్యార్థులకు మాత్రమే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ఈ పథకాన్ని అమలు చేసే ప్రక్రియలో అధికారులు నిర్లక్ష్యం చూపవద్దని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ముఖ్యంగా APAR ID రిజిస్ట్రేషన్లో లోపాలు ఉన్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే 45 రోజుల్లోపు 100 శాతం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల చదువులో కొత్త మార్పులు తీసుకు వస్తున్నామన్నారు. ఒకే పుస్తక విధానం, క్లాసులు పూర్తయిన తర్వాత చిన్న వీడియోల ద్వారా పాఠాలను మరింత బలపరచే విధానం, అలాగే క్లిక్కర్ ద్వారా సమాధానాలు ఇచ్చే కొత్త టెక్నాలజీను తొమ్మిదో తరగతి నుంచి ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ విధానం విద్యార్థుల్లో ఆసక్తి పెంచడమే కాకుండా, వారి నేర్చుకునే స్థాయిని కూడా అంచనా వేయడంలో ఉపయుక్తమవుతుందని అన్నారు.
ఇకపై కలెక్టర్లను లేదా ఇతర అధికారులను తరచూ నివేదికలు అడగబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి పని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్లోకి మారుతున్నందు వల్ల, వేరే నివేదికల అవసరం ఉండదని అన్నారు. అంతేకాకుండా, అన్ని రికార్డులు డిజిటల్ రూపంలో ఉండాలని ఆయన ఆదేశించారు. అదే సమయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ పిల్లల హాజరు తక్కువగా ఉందని కలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చింది. అంగన్వాడీలను పాఠశాలలకు అనుసంధానం చేసి, ఆరు సంవత్సరాల పై బడిన పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలన్న సూచనలు ఇచ్చారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 13 వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్రీయ పోషణ్ మా కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.రాష్ట్రం తీసుకున్న ఈ 4 శాతం వడ్డీ సబ్సిడీ నిర్ణయం విద్యార్థుల విద్యలో ఒక గేమ్ ఛేంజర్గా నిలవనుంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీకి తోడు రాష్ట్రం ఇచ్చే సాయం, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్య తలుపులు విస్తృతంగా తెరవనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.