)
Sugali Preethi Case: ఏపీలో రాజకీయంగా మళ్లీ సుగాలి ప్రీతి కేసు చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని డిసైడ్ అయ్యింది. సుగాలి ప్రీతి తల్లి తమకు న్యాయం చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పట్టించుకోలేదని ఆరోపిస్తూ మీడియా ముందు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ కారణంగానే కేసును సీబీఐకి సిఫారసు చేయాలని నిర్ణయించారు. నాలుగో తేదీన జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని కేంద్ర హోంశాఖకు పంపనున్నారు. నిజానికి ఈ కేసును వైసీపీ ప్రభుత్వంలోనూ సీబీఐకి అప్పగిస్తూ సిఫార్సు చేశారు. కానీ తమకు వనరుల్లేవని సీబీఐ అప్పట్లో వాదించింది. దాంతో ఈ కేసు సీబీఐకి వెళ్లలేదు.
సుగాలి ప్రీతి కర్నూల్ జిల్లాకు చెందిన రాజునాయక్, పార్వతి దేవి దంపతుల కూతురు. 2017 ఆగస్టు 19వ తేదీన కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ ప్రాంగణంలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. స్కూల్ యాజమాన్యం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే సుగాలి ప్రీతి పేరెంట్స్ మాత్రం ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారంటూ ఆరోపించారు. స్కూల్ యాజమాని కుమారులపై వారు ఆరోపణలు చేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న వారిని అరెస్ట్ కూడా చేశారు. అయితే వాళ్లు బెయిల్ పై విడుదలయ్యారు.
2018లో ప్రీతి తల్లిదండ్రులు స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ ఆరోపిస్తూ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. సీబీఐ గతంలో వనరుల కొరత కారణంగా కేసును తీసుకోలేదని హైకోర్టుకు తెలిపింది. అప్పట్లో రాష్ట్రం సీబీఐకి జనరల్ కన్సెంట్ ఇవ్వలేదు. ఆ సమస్యలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అలాంటి సమస్యలు లేకపోవడంతో కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండటంతో సుగాలి ప్రీతి కేసును సీబీఐ హ్యాండిల్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందని భావిస్తున్నారు.
ఎన్నికల సమయంలో ఈ కేసులో న్యాయం చేస్తానని, ముఖ్యంగా గెలిచిన తర్వాత మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్పై చేస్తాను అని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 14 నెలలు గడిచినా ఇప్పటివరకు ఈ కేసుపై పవన్ స్పందించలేరని.. ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రీతీ తల్లి ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెకు న్యాయం జరగకపోవడం వల్ల తీవ్రంగా నిరాశ చెందుతున్నానని, అవసరమైతే జనసేన కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కూడా హెచ్చరించారు. అంతేకాక, సుగాలి ప్రీతికి న్యాయం జరగకపోవడంపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ కేసు విషయంలో నా పరిస్థితి పండ్లు ఇచ్చే చెట్టుకే రాళ్లతో కొట్టినట్లు మారింది. సహాయం చేసిన వారినే తప్పుబడితే ఎలా? అని వ్యాఖ్యానించారు. ప్రీతీ తల్లి ఆవేదనను చూసి, అప్పట్లోనే వేలాదిమందితో కలిసి కర్నూలులో పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించామని పవన్ గుర్తుచేశారు. ఆ నిరసనల ప్రభావంతోనే అప్పటి ప్రభుత్వం కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించేందుకు లేఖ జారీ చేసిందని వివరించారు.తాను కూడా సుగాలి ప్రీతి కేసును సీరియస్గా తీసుకుని, సీఐడీ చీఫ్తోపాటు డీజీపీ, హోం మంత్రి స్థాయిలో అధికారులను సంప్రదించానని పవన్ చెప్పారు. త్వరగా నిజం బయటకు రావాలి, ప్రీతీ కుటుంబానికి న్యాయం జరగాలే అనే దృష్ట్యా సంబంధిత శాఖలకు సూచనలు చేశానని ఆయన స్పష్టం చేశారు. సీఐడీ విచారణలో తేలిన అంశాలను ప్రస్తావిస్తూ .. అనుమానితుల డీఎన్ఏ నమూనాలు సరిపోలలేదని, అలాగే సాక్ష్యాలను తారుమారు చేసిన సంకేతాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు.
అయితే ఈ వివరణ తర్వాత కూడా వైసీపీ నేతలు ప్రీతీ తల్లితో కలిసి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి పవన్పై విమర్శలు కొనసాగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని చివరికి ప్రభుత్వం దీనిని సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ అంశంపై మళ్లీ రాజకీయ వేడి పెరుగుతోంది. ఒకవైపు ప్రీతీ కుటుంబం న్యాయం కావాలని పట్టుబడుతుంటే, మరోవైపు రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలు, ఆయన వివరణలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఇవన్నీ కలిసిపోతూ సుగాలి ప్రీతి కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.