AP Volunteers Latest News Updates: అనుకున్నదే అయింది. ఏపీలో వాలంటీర్ల ఆశలు గల్లంతయ్యాయి. ఎన్నికలకు ముందు వాలంటీర్ల జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత అసలు వాలంటీర్లు వ్యవస్థలోనే లేరంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా శాసనమండలిలో జరిగిన చర్చలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మరోసారి స్పష్టం చేశారు. వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాలంటీర్లు ఎవ్వరు లేరని.. రెన్యూవల్ చేయలేదని కుండబద్దలు కొట్టేశారు.
వాలంటీర్లను 2023 ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. ఆగస్టు తర్వాత వాలంటీర్ల పదవి పొడిగింపుకు జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వలేదని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే రెగ్యులరైజ్ చేసేవాళ్లమని వివరించారు.
వాలంటీర్ల తొలగింపుపై వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం చేశారు. శాసనమండలిలో ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, వరుదు కల్యాణి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు వాలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలకి పెంచుతామని హామీ ఇచ్చారని.. కానీ ఈ ప్రభుత్వం 2,56,000 మంది వాలంటీర్లను తొలగించిందని ఫైర్ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థనే లేదని చెబుతున్నారని.. 2024 సెప్టెంబర్లో వరదలు వచ్చినప్పుడు ఎలా డ్యూటీ చేయించారని నిలదీశారు. నవంబర్ 2024 వరకు వాలంటీర్లకు ఐడీలు ఎలా కొనసాగించారని ప్రశ్నించారు.
2023 ఆగస్టు నుంచి వాలంటీర్లు వ్యవస్థ లేదని దారుణంగా మాట్లాడుతున్నారని.. వ్యవస్థ లేకపోతే 2024లో మేనిఫెస్టోలో ఎలా పెట్టారని ఎమ్మెల్సీలు అడిగారు. 2024 ఏప్రిల్లో ఎన్నికల్లో ఊరూరా తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారని నిలదీశారు. 2,60,000 వేల మందిని తొలగించడం అన్యాయమని.. వాళ్లు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. వాలంటీర్లు లేకపోతే ఎందుకు విపత్తు శాఖ ఆదేశాలు ఇచ్చిందని.. అసలు వ్యవస్థలో లేనివారిని ఎలా వరదల్లో వినియోగించారని ప్రశ్నించారు.
మరోవైపు భారీ ధర్నాకు వాలంటీర్లు సిద్ధమయ్యారు. సీఐటీయూ ఆధ్వర్యంలో వాలంటీర్లు పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రూ.10 వేలకు జీతం పెంచాలని తాము కోరలేదని.. రూ.5 వేల జీతంతో ఇబ్బంది పడుతున్నారని రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ వ్యవస్థే లేదంటూ చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఉపాధి లేకుండా చేశారని.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వాలంటీర్లు కోరుతున్నారు.
Also Read: Ar Rahman: ఏఆర్ రెహమాన్ ఇప్పటికి నా భర్తే.. ఎమోషనల్ అయిన సైరా భాను.. స్టోరీ ఏంటంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









