
Duggana Babji vs Thota Sudhir: జనసేన పార్టీ ఓ సంచలనం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తే.. అన్ని చోట్ల పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో.. పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఎప్పుడైతే పవన్ డిప్యూటీ సీఎం అయ్యారో.. అప్పటినుంచే పార్టీలో సీనియర్లకు, కార్యకర్తలకు గుర్తింపు లేదనే టాక్ ఉంది. గతంలో వైసీపీతో అంటకాగి వ్యాపారాలు చేసుకున్న కొందరు నాయకులు పార్టీలో చేరడంతో ఈ పరిస్థితి వచ్చిందన్న చర్చ ఉంది.
ప్రస్తుతం జనసేన పార్టీలో వైసీపీ నుంచి వచ్చిన వారి పెత్తనమే ఎక్కువైపోయిందని కార్యకర్తలు వాపోతున్నారు. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన తోట సుధీర్ కు కాకినాడ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. అధికారంలోకి రాగానే ఏకంగా పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆయనకు బంధువైన పెద్దాపురం నియోజవర్గానికి చెందిన తుమ్మల బాబుకు ఏకంగా ఐదు పదవులు ఇచ్చారు. ఇద్దరు కలిపి కాకినాడ సిటీలో క్యాడర్ ను అణిచివేస్తున్నారంటూ జనసేన నేత, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దుగ్గన బాబ్జి, ఆయన అనుచరులు ఓ సమావేశం పెట్టారు. మీడియాను అనుమతించకుండా ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుని, ఆ ఇద్దరిపై విరుచుకుపడ్డారు. పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అధినేతకు ఫిర్యాదు పంపుతున్నట్లు ప్రకటించారు.
అయితే జనసేన నేతల సమావేశం ముగిసిన వెంటనే దుగ్గన బాబ్జిపై సుధీర్ వర్గం టార్గెట్ చేసింది. గతంలో ఒక కేసు రాజీకి వెళ్లిన దుగ్గన బాబ్జీ ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించింది. ఇలాంటి వారే పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారంటూ మహిళలతో తిట్టించే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే బాబ్జి వర్గానికి చెందిన వీర మహిళలు మరో ప్రెస్ మీట్ పెట్టారు. బాబ్జి పార్టీ కోసం పనిచేస్తారు. ఇది అధినేతకు తెలుసు. ఆయనను అణగదొక్కేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అటాక్కు దిగారు. కేవలం వారం రోజులు వ్యవధిలో రెండు వర్గాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుని రోడ్డు ఎక్కాయి. పార్టీ బజారున పడిందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సుధీర్కు అండగా జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు పని చేస్తున్నారని వారి బంధువులే కాక కాపు సామాజిక వర్గానికి చెందిన మరో వర్గం ఆరోపించింది.
తోట సుధీర్ కు కాకినాడ సిటీ కన్వీనర్ పదవితో పాటు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పదవి ఇచ్చారని, ఆయన వెనుక పట్టుమని పదిమంది లేరు. ఆయన ఎప్పుడూ పార్టీ కోసం అంకితభావంతో పనిచేయలేదు. ఎలా ఈ పదవులు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. అదే విధంగా ఆయనకు బంధువైన తుమ్మల బాబుకు కాకినాడ జిల్లా అధ్యక్ష పదవి, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్, పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జ్ తోపాటు పిఠాపురం సమన్వయ కమిటీలో సభ్యత్వం ఇలా ఐదు పదవులు కట్టబెట్టారు. వారిద్దరే కాకినాడ జిల్లాను ఏలుతున్నారు. మా పరిస్థితి ఏంటని పార్టీ పెట్టిన నాటి నుంచి పనిచేస్తున్న సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. జవాబు చెప్పే నాధుడు లేరని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ రెండు వర్గాల ఘర్షణ ఎక్కడ వరకు వెళ్లింది అంటే పవన్ నటించిన సినిమాలు కూడా పంచుకుని సంబరాలు చేయడం వరకు చేరుకుంది. దాంతో పవర్ స్టార్ పవన్ అభిమానులకు ఇది ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఫంక్షన్ వేడుకలు దుగ్గన బాబ్జి నిర్వహించారు. దీనికి పోటీగా ఓజి సినిమాకు సంబంధించి 60 అడుగుల పవన్ కటౌట్ పెట్టి తోట సుధీర్ కార్యక్రమాన్ని నడిపించారు. సుదీర్ చేసిన పెద్ద కార్యక్రమం ఇది ఒకటే అంటూ ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీలో స్వలాభం పొంది పార్టీలోకి వచ్చిన నేతలు కావాలని ఇలా చేస్తున్నారని జనసైనికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పార్టీ కోసం పనిచేయడం లేదు. కష్టపడ్డ జనసైనికులకు అండగా ఉండడం లేదు. కనీసం పనులు చేయడం లేదు. వారి స్వలాభం కోసం ఇలా రోడ్డెక్కి అధినేత పరువు తీస్తున్నారని వాపోతున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల్లో సమన్వయం చేసుకోవాల్సిన తుమ్మల బాబు, సుధీర్ కు ఏకపక్షంగా కొమ్ముకొస్తున్నారని ఆయనపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఇందులో కొందరు వైసిపి కోవర్టర్లు ఉన్నారని నేరుగా ప్రెస్ మీట్ లు పెట్టి మరీ ఆరోపణలు చేసిలుకుంటున్నారు.
ఏదీఏమైనా వరుసగా జరుగుతున్న ఈ వివాదాలు, సంఘటనలు అధినేత పవన్ దృష్టికి వెళ్లాయి. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వేములపాటి అజయ్ కూడా దృష్టి సారించారని నాయకులు వెల్లడించారు. హద్దు మీరి ఆరోపణలు చేసుకుంటూ, పార్టీని రోడ్డు మీద పడేస్తున్నారు. కాకినాడలో టిడిపికి చెందిన ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు బలహీనంగా ఉన్నారు. ఈ సమయంలో జనసేన ను మరింత బలపరిచే విధంగా చర్యలు తీసుకోవడం మానేసి మరింత చులకన చేస్తున్నారంటూ అధినేతకు పలువురు ఫిర్యాదు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇందుకు సంబంధించి నివేదిక పంపినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కాకినాడలో పంచాయితీపై పవన్ స్పందించారు. ఈ ఎపిసోడ్ లో ఎవరెవరి పాత్ర ఉంది.. ఎవరు వ్యాపారాలు చేస్తున్నారు.. పార్టీకి నష్టం చేస్తున్నారు.. వైసిపి కోవర్టులు ఎవరు.. గుర్తించి చర్యలు తీసుకునేందుకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరో పది రోజుల్లో పలువురుపై వేటు పడటం పక్కా అనే చర్చ జరుగుతోంది. ఇంతమంది నేతలు పార్టీ పేరు చెప్పుకొని రోడ్డెక్కతున్న కాకినాడ జిల్లా నేతలు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు కాకినాడలో టిడిపి ఎమ్మెల్యే అసమ్మతితో సతమతమవుతుంటే బలంగా ఉన్న జనసేనలో కూడా లుకలుకలు ప్రారంభమయ్యాయి. బిజెపికి పట్టుమని పదిమంది లీడర్లు కూడా లేరు. దీనిని క్యాష్ చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి పావులు కదుపుతున్నారని కూటమినేతలే అంగీకరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook