Pithapuram Politics: కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ రీజినల్ కో ఆర్డినేటర్ ఎస్వీఎస్ఎన్ వర్మ గురించి తెలియని వారుండరు.. ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్న.. వర్మకు మాత్రం ఎలాంటి పదవులు దక్కడం లేదు.. మొన్నటివరకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని భావించినా వర్మ.. చివరకు ఆ పదవి కూడా దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు ఈ నేపథ్యంలో కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతున్న ఆయన మాత్రం పార్టీని వీడే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వర్మ తీసుకున్న ఓ నినాదం ఇప్పుడు జనసేన నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోందని ప్రచారం సాగుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మ పోటీ చేద్దామని భావించారు. కానీ అక్కడి నుంచి పవన్ కల్యాణ్ పోటీకి దిగడంతో పిఠాపురం సీటును పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేశారు. అప్పటికే వర్మకు ఎమ్మెల్సీ, రాజ్యసభ, టీటీడీ చైర్మన్ ఇలా ఎన్నో పదవులు వస్తాయని అనుచరులు ఆశించారు. చివరకు ఆయనకు పిఠాపురంలో పదవి ఇవ్వరు అన్న నమ్మకం అటు టిడిపి, ఇటు జనసేనలో ఏర్పడిపోయింది. పవన్ కళ్యాణ్ ఉండగా పిఠాపురంలో రెండో పవర్ పాయింట్ ఉండదు. ఉండకూడదు అన్నది చంద్రబాబు నిర్ణయంగా తేలిపోయింది. దీంతో వర్మ పరిస్థితి ముందు నుయ్యి .. వెనుక గొయ్యిలా తయారయిందని అంటున్నారు..
ఇక తెలుగుదేశం పార్టీని వీడేందుకు వర్మకు ఎంతమాత్రం ఇష్టంలేదు. అటు జిల్లాలో వైసిపి రోజు రోజుకు బలహీన పడుతోంది. జనసేనలోకి వెళ్లినా ఇంతకంటే మంచి పదవి వచ్చే అవకాశం కూడా లేదు. బీజేపీ పరిస్థితి కూడా ఇక్కడ అంతంత మాత్రమే. దీంతో ఆయన టీడీపీని వీడలేకపోతున్నారు. అలా అని అసహనాన్ని అదిమి పెట్టలేకపోతున్నారు. ఈ సమయంలో పైకి మాత్రం పదవులు వస్తాయి.. పోతాయి.. పార్టీ ముఖ్యమని ఆయన అంటున్నారు. అంతేకాదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్నన్నీ రోజులు తనకి పదవి రాదు అన్న నమ్మకం ఏర్పడిపోయింది. దీంతో కొత్త నినాదం ఎత్తుకున్నారు. అదే 'ప్రజలే నా బలం .. కార్యకర్తే అధినేత'. ఈ నినాదాన్ని హోరెత్తిస్తున్నారు. అంతేకాదు ప్రతి బుధవారం నియోజకవర్గంలో పర్యటిస్తానని ఆయన స్వయంగా ప్రకటించారు. అటు కార్యకర్తల సమస్యలు అడిగి తెలుసుకుంటానంటూ ఆయన చేసిన ఓ పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే వర్మ చేసిన ఈ ట్వీట్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్న చర్చ రెండు పార్టీల్లోనూ జరుగుతోందని అంటున్నారు..
మొత్తంమీద పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పిఠాపురంను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. అయినప్పటికీ వర్మ కంటూ ఒక ప్రత్యేక వర్గం ఉంది. వారు ఆయన వెంటే ఉంటున్నారు. వర్మకి పదవి ఉన్నా లేకున్నా ఆయనతో పయనిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కార్యకర్తే అధినేత అంటూ వర్మ ఎందుకన్నారు. తద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు. దీని వల్ల ఆయనకు ఒనగూరే ప్రయోజనం ఏమిటి అన్నది తేలాల్సి ఉంది. తన వెంట ఉన్న కార్యకర్తలు చెదిరిపోకుండా ఉండేందుకే ఈ నినాదం ఎత్తుకున్నారా .. లేక మరేదైనా వ్యూహం ఉందా.. ప్రస్తుతం పిఠాపురంలో 'టాక్ ఆఫ్ ది టౌన్' గా ఈ నినాదం మారింది.
Also Read: Ex CM KCR: కేసీఆర్ ప్లాన్లో సడెన్ మార్పు ఎందుకు..? ఆ భయంతోనే వేదిక మార్చేశారా..?
Also Read: Welfare Schemes: ప్రజలకు భిక్షం మాదిరి కాకుండా సేవలా సంక్షేమ పథకాలు అందించాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









