)
Chandrababu Sudden Visits: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబర్ నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతీ పౌరుడికి సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో అనే అంశాన్ని తనిఖీ చేస్తానని సీఎం తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో బుధవారం ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రభుత్వ సేవల్లో సంతృప్త స్థాయి సహా రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరుపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలు మెచ్చేలా సుపరిపాలన అందిస్తున్నామని.. పాలనలో సుస్థిర విధానాలను అమలు చేస్తామని సీఎం తెలిపారు.
గతనెల 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, లబ్ధి తదితర అంశాలపై ప్రజల నుంచి సేకరించిన ఫీడ్ బ్యాక్ వివరాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. దీపావళి పండుగ తర్వాత కూడా సూపర్ జీఎస్టీ ద్వారా పన్నుల తగ్గింపు, తద్వారా ధరలు తగ్గిన అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో కలిగే లబ్ధిని స్లైడ్స్ ద్వారా సినిమా థియేటర్లలో ప్రదర్శించాలని సూచించారు.
వివిధ శాఖలు అందించే ప్రభుత్వ సేవలపై టెక్నాలజీ డేటా ఆడిటింగ్ ద్వారా సంతృప్త స్థాయిని అంచనా వేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు అధికారులు ఇచ్చే సమాచారానికి పొంతన ఉండాలని సీఎం చెప్పారు. సామాన్యుడికి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ అనే విధానం సమర్ధవంతంగా ప్రజలకు సేవలందిస్తామన్నారు. దీనిపై నవంబర్ తొలి వారంలో మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్ల పనితీరును మదింపు చేస్తామని పేర్కొన్నారు. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా వేర్వేరు ఘటనల్ని సమన్వయంతో పర్యవేక్షించడంతోపాటు త్వరితగతిన బాధితులకు సాంత్వన కలిగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ చలానాల పేరిట వాహనదారులను ఇబ్బందులు పెట్టవద్దన్నారు.
రాష్ట్రంలోని కొన్ని అంశాలను రాజకీయంగా ఉపయోగించుకుని నేరాలు చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని పరోక్షంగా వైఎస్సార్సీపీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు నిర్మిస్తుంటే.. ప్రైవేటు పరం చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ ద్వారా వచ్చే మెడికల్ కాలేజీల్లో పేద విద్యార్ధులకు అదనంగా మరిన్ని సీట్లు అందుబాటులోకి రావటంతో పాటు పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం కూడా లభిస్తుందని వివరించారు. అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు కూడా కొందరు కుట్రలు చేశారని.. సకాలంలో సాంకేతికత వినియోగించి వారి బండారం బయట పెట్టాలని సీఎం చంద్రబాబు చెప్పారు. కల్తీ మద్యం తయారు చేసి తిరిగి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి