AP NDA Govt Tenure: గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేసి ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చిన ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి కొన్ని వారాల్లో ఏడాది పూర్తి చేసుకుంటోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకుని అఖండ విజయంతో ప్రభుత్వాన్ని ఎన్డీయే కూటమి ఏర్పాటుచేసింది. మరోసారి ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టి పది నెలలు పూర్తయ్యింది. మరి ఈ పాలనా కాలంలో ఏం చేశారు? ఎన్ని హామీలు అమలుపరిచారు? సీఎంగా చంద్రబాబు విజయవంతమయ్యారా? అనేది తెలుసుకుందాం.
Also Rea: Indus Waters Treaty: సింధు నది జలాల ఒప్పందం ఏమిటి? టాప్ 10 ముఖ్యాంశాలు ఇవే!
సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు దీటుగా ఉచిత హామీలు ఇచ్చారు. 'ఫ్రీ ఫ్రీ ఫ్రీ' అంటూ ఉచిత పథకాలు ప్రవేశపెట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేశారని చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా పింఛన్ల పెంపు అమలు చేశారు. ఠంచన్గా ఒకటో తేదీకే పింఛన్లు అందిస్తున్నారు.
Also Read: Summer Best Tour Places: సమ్మర్ సెలవుల్లో బెస్ట్ టూర్ ప్లేస్లు ఇవే.. జీవితంలో మరచిపోరు
ఫించన్ల పెంపు
ఎన్టీఆర్ భరోసా పథకం పేరిట కూటమి ప్రభుత్వం పింఛన్లను అందిస్తోంది. పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచారు. దేశంలో అత్యధిక మందికి పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రతీ నెలా 64 లక్షల మందికి పైగా పెన్షన్లు అందిస్తున్నారు. పింఛన్ల కోసం నెలకు సుమారు రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తోంది. పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు తక్షణం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం. ఇలా దాదాపు 90 వేల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
ఉచిత గ్యాస్ సిలిండర్
సూపర్ సిక్స్లో దీపం-2 పథకం ప్రధానమైనది. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి హామీ ఇవ్వగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అమలుచేస్తోంది. కోటికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పథకం కొందరికి మాత్రమే అమలవుతోందని రాష్ట్రవ్యాప్తంగా ఇంకా అమలు కావడం లేదని తెలుస్తోంది.
Also Read: Diesel Subsidy: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. డీజిల్ ధరపై రూ.9 తగ్గింపు
మెగా డీఎస్సీ
నిరుద్యోగులకు ప్రధానమైన హామీ మెగా డీఎస్సీ. భారీ స్థాయిలో ఉపాధ్యాయుల భర్తీ చేపడతామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 16,347 ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేశారు. ఈ డీఎస్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
అన్న క్యాంటీన్లు
పేదలకు మధ్యాహ్న భోజనం అందించే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. రాజకీయంగా కాకుండా ప్రజలు కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఎన్నికల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను గతంలో కన్నా పటిష్టంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 200కు పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు ఏశారు.
రూ.99 కే క్వార్టర్
మద్యం విధానం కొత్తగా తీసుకువచ్చారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు మద్యం విధానం సర్వనాశనమైంది. ప్రభుత్వమే మద్యం విక్రయించడం తీవ్ర విమర్శలపాలైంది. అంతేకాకుండా నాసిరకం బ్రాండ్లు, కొత్త మద్యం.. అధికంగా ధరలు ఉండడం వంటి వాటితో ఏపీలో మద్యం విధానం రాజకీయంగా తీవ్ర విమర్శలకు గురి చేసింది. కొత్త మద్యం విధానం తీసుకువచ్చారు. అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచారు. రూ.99 కే క్వార్టర్ మద్యం.. ప్రీమియం మద్యం లభిస్తోంది. ఇక పూర్తిగా గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయించారు.
ఇతర పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలు
- ఉచిత ఇసుక సరఫరా చేస్తున్నారు. దీంతో పేదలకు లబ్ది జరుగుతోండగా.. నిర్మాణ రంగానికి ఊతం వచ్చింది.
- ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ.
- డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు.
- 8,427 పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవవేతనం
- అర్చకుల జీతాలు రూ. 10,000 నుంచి రూ. 15,000కు పెంపు. ధూపదీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సాయం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.
- ఉపాధి కోసం చూస్తున్న వేద విద్యార్ధులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తున్నారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనాన్ని రూ.20,000 నుంచి రూ.25,000కు పెంచారు. దేవాలయ బోర్డుల్లో బ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులకు చోటు.
- ఏపీలో కొత్త వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇమామ్లకు రూ.10 వేలు, మౌజమ్లకు రూ.5 వేలు గౌరవ వేతనాల పెంచారు.
- తీవ్ర విమర్శలకు దారితీసిన చెత్త పన్నును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేశారు.
- చేనేతలకు జీఎస్టీ ఎత్తివేసి చేనేత కార్మికులకు ఊరట ఇచ్చారు.
- రూ.25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా
- వాట్సప్ ద్వారా 250కి పైగా సేవలు.
- ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీలకు అదనంగా రూ.20 వేల సబ్సిడీతో సోలార్ రూఫ్టాప్
- త్వరలో ఆదరణ-3, తల్లికి వందనం, అన్నదాత పథకాల అమలుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
మరచిన హామీలు
సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన ఆర్టీసీ ఉచిత బస్సును మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. జాబ్ క్యాలెండర్.. ఉద్యోగాల భర్తీ మరచిపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిపులు వంటి వాటిని అమలు చేయలేదు. వీటితోపాటు ప్రధాన హామీలను అటకెక్కించారని వైఎస్సార్ సీపీ విమర్శిస్తోంది. చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయారని చెబుతోంది. ప్రధానంఆ కక్ష రాజకీయాలు.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు నడుస్తోందని.. సంక్షేమం పక్కనపెట్టారనే విమర్శలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు.. ఇంకా నాలుగేళ్ల కాలం ఉండడంతో మిగతా హామీలను అమలు చేస్తారని కూటమి నాయకులు చెబుతున్నారు. పది నెలల పాలనలో చంద్రబాబు ఫెయిలయ్యారా..? పాసయ్యారా? మీరు చెప్పండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









