
America Tariff On India: 'అమెరికా సుంకాల కారణంగా రాష్ట్ర జీడీపీలో కీలకమైన ఆక్వా రంగం తీవ్రంగా నష్టపోతుంది. ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలోకి వెళ్తున్నారు. వెంటనే ఆక్వా రంగానికి అండగా నిలవాలి' అని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. అమెరికా ప్రభుత్వం విధించిన సుంకాల కారణంగా ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయే ప్రమాదం ఉందని.. ఈ సంక్షోభ సమయంలో ఆక్వా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అమెరికా విధించిన సుంకాల కారణంగా ఏపీ ఆక్వా రైతులు పడుతున్న కష్టాలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయల్కు ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అమెరికా విధించిన సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి.. రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర జీడీపీలో మత్స్య రంగం కీలక భూమిక పోషిస్తోందని.. ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలవాలని కోరారు.
'భారతదేశం నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం 27 శాతం దిగుమతి సుంకం విధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 2.55 బిలియన్ల డాలర్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటిలో రొయ్యలే 92 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అమెరికాకు రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారతదేశంపై 27 శాతం దిగుమతి సుంకం కారణంగా ఆక్వా రైతాంగం నష్టపోతుంది' అని లేఖలో సీఎం చంద్రబాబు వివరించారు.
ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10 శాతం పన్ను మాత్రమే అమెరికా విధిస్తోందని.. ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ వారికి అనుకూలంగా మారుతోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 'మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77 శాతం కౌంటర్వెయిలింగ్ డ్యూటీ (సీవీడీ) భారాన్ని మోస్తున్నారని.. అన్ని సుంకాలను కలిపితే ఈక్వెడార్కు భారతదేశానికి మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20 శాతం ఉంటుంది' అని లేఖలో కేంద్ర మంత్రికి వివరించారు.
అమెరికా విధించిన కొత్త సుంకం ఏప్రిల్ 5, 2025 నుండి అమల్లోకి రావడంతో అమెరికాకు వెళ్లే అన్ని ఎగుమతులపైనా ఈ భారం పడుతోందని సీఎం చంద్రబాబు లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. 'గతంలో వచ్చిన ఆర్డర్లకు అనుగుణంగా ఇప్పటికే సేకరించిన ఉత్పత్తులు ప్యాకింగ్ చేసి కోల్డ్ స్టోరేజ్లు, పోర్టులలో ఉన్నాయి. కొత్త నిబంధనల వల్ల ఈ ఉత్పత్తులపై సుంకాల భారం పడుతుంది' అని తెలిపారు. ఏపీలో శీతల గిడ్డంగులు కూడా నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంట ఎక్కడ ఉంచాలో కూడా తెలియని గందరగోళ పరిస్థితిలో రైతులు ఉన్నారని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలతో ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు ఇలా అందరికీ సమస్యలు వచ్చాయి. ఈ కారణంగా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి సుంకాల నుంచి రొయ్యలను మినహాయింపు జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్చలు జరపాలని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు కోరారు. సకాలంలో చర్యలు తీసుకుని ఆక్వాపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మందిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe