)
Amaravati Re Development: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దామని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజధాని పున:నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి లభిస్తుందని ప్రకటించారు. సభకు తరలి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదని ఎన్డీయే కూటమికి సూచించారు. అమరావతి అందరిది... రాష్ట్రానికి ఆత్మవంటిది అని పేర్కొన్నారు. త్వరలోనే 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి మే 2వ తేదీన రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి ఘన స్వాగతం పలకడంతో పాటు సభను విజయవంతం చేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రకటించారు. ప్రధాని మోదీ పర్యటనపై ఎన్డీఏ నేతలతో సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి చర్చించారు. ఈ సందర్భంగా ఎన్డీయే నాయకులకు దిశానిర్ధేశం చేశారు.
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 'ఒక కుటుంబం నివసించేందుకు మంచి ఇల్లు ఉండాలని ఎలా అనుకుంటామో ప్రజలు గర్వంగా చెప్పుకోవడానికి కూడా రాజధాని ఉండాలి' అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, సీమ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రానికి అమరావతి ఆత్మ వంటిది అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజల్ని తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తిరిగి వారికి రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు. రాజధానిలో రైతులను భాగస్వాములను చేస్తున్నామని.. రోడ్ల నిర్మాణం జరిగితే రవాణా సౌకర్యం పెరగడంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని వెల్లడించారు. ఇబ్బందులను అధిగమిస్తూనే సంక్షేమం, అభివృద్ధి బాటను వీడటం లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నట్లు ఎన్డీయే నాయకులకు సీఎం చంద్రబాబు తెలిపారు.
పోలవరానికి నిధులు, విశాఖ రైల్వేజోన్ మంజూరు, స్టీల్ ప్లాంట్కు రూ.11,400 కేంద్రం కేటాయించిందని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పటికే మత్య్సకారుల సేవలో, ఎస్సీ వర్గీకరణ, అన్నక్యాంటీన్లు, పింఛన్లు, 3 గ్యాస్ సిలిండర్లు అందించడంతో పాటు 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామని వివరించారు. 'త్వరలోనే 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుడతామని.. 175 నియోజకవర్గాల్లోనూ రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి చేసి వన్ ఫ్యామిలీ.. వన్ ఎంటర్ప్రెన్యూర్ సాకారం దిశగా అడుగులు వేస్తాం' సీఎం చంద్రబాబు వెల్లడించారు.
'రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతాం. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం. ఎరైన్-కో రామాయపట్నంలో, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ దిగ్గజ కంపెనీలు రూ.లక్ష కోట్లతో పెట్టుబడులు పెడుతున్నాయి. రాయలసీమను డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటో మొబైల్స్, డ్రోన్, శాటిలైట్ లాంచింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అభివృద్ధి చేస్తాం. రాయలసీమకు బెంగళూరు, హైదరాబాద్ అనుసంధాన హైవేలు, ఎయిర్ పోర్టులు అందుబాటులో ఉంటాయి. తద్వారా లాజిస్టిక్ హబ్గా రాయలసీమ మారుతుంది’ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe