Chandrababu Birthday: తన పుట్టినరోజున సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు చెప్పారు. అందరూ చూపించిన అభిమానం.. ఆప్యాయతతో తన మనసు ఉప్పొంగిందని ప్రకటించారు. ఇప్పటివరకు తన ప్రయాణంలో తోడుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన జీవితాన్ని.. రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
తన పుట్టిన రోజు సందర్భంగా శుభకాంక్షలు చెప్పిన రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 'ఎక్స్' వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు. '75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో.. 47 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో నాకు ఎల్లప్పుడూ తోడునీడగా ఉండి.. నన్ను ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా' అని తెలిపారు. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం… అపురూప అవకాశం' అని వివరించారు.
Also Read: YS Sharmila: 'అమరావతిపై ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్లు గాడిదలు కాశారా?'
'మీ ఆదరాభిమానాలు.. నాపై మీరు ఉంచిన నమ్మకం నాలో బాధ్యత, నిబద్ధతను మరింత పెంచాయి. తెలుగు సమాజ పురోగతి కోసం అలుపులేకుండా పనిచేసేలా మీరంతా నాలో ఉత్సాహం నింపారు. మీ భవిష్యత్ కలలు, ఆకాంక్షలను సాకారం చేయాడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నా' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం.. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని నా జన్మదినం రోజున వినమ్రంగా తెలియజేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
'స్వర్ణాంధ్ర-2047 విజన్ మీ అందరి ఆకాంక్షల సమాహారం. మీ మద్దతు.. మీ సహకారం.. సమష్టి కృషితో ఆ కలను నిజం చేస్తా' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 'ప్రతీ అడుగు.. ప్రతీ ఆలోచన.. ప్రతీ కార్యక్రమం మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే అందరికీ అవకాశాలు కల్పించేలా, ప్రతి పౌరుడి భవిష్యత్తుకు భరోసా నిచ్చేలా పాలన అందిస్తా' అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ ఆవిష్కరణలకు.. అవకాశాలకు కేంద్రంగా మలచాలనేది తన తపన అని పేర్కొన్నారు. ‘థింక్ గ్లోబల్లీ-యాక్ట్ గ్లోబల్లీ’ విధానంతో రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుకుందామని సీఎం చంద్రబాబు చెప్పారు.
'సమాజంలో అసమానతలు పోవాలి. పేద-ధనిక వర్గాల మధ్య అంతరాలు తగ్గాలి. పేదరికం లేని సమాజం స్థాపించాలనేదే నా సంకల్పం' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మూడు దశాబ్దాల నాడు తాను ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ సమాజంలో ఎంతో మార్పుతెచ్చిందని గుర్తుచేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తెలుగు జాతిని నిలపాలన్నదే తన అభిలాష అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఆత్మగౌరవం.. ఆత్మవిశ్వాసం తెలుగు ప్రజల రక్తంలోనే ఉందని.. దేశభక్తి చాటేలా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు చేయిచేయి కలుపుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









