)
AP Rains: కాకినాడ జిల్లాను కుండపోత వానలు ముంచెత్తుతున్నాయి. రెండు రోజుల నుంచి కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 21 మండలాల్లో భారీ వర్షపాతం నమోదయ్యింది. నిన్న ఉదయం 8 గంటల నుంచి నేటి ఉదయం 6 గంటల వరకు జిల్లాలో 50.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా కోటనందూరు మండలంలో 9.4 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాకినాడ, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాలు, 21 మండలాల తాసిల్దార్ కార్యాలయాలలోనూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా వరి ఆధారిత ప్రాంతమైన జిల్లాలో వర్షాలకు ఖరీఫ్ పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు పొలాల్లోని పంటలు నేలవాలాయి. నీట మునిగి కోతకు వచ్చిన పొలాలు గింజ రాలిపోతాయని, కొన్నిచోట్ల గింజ పోసుకునే దశలో ఉండడంతో, గింజ తయారు కాక కుళ్ళిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత మూడు రోజుల నుంచి వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురు గాలులతో ముందు జాగ్రత్త చర్యగా కరెంటు సరఫరా నిలిపివేశారు. 27వ తేదీ వరకు ప్రజల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇలా వుండగా వర్షాల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కూలి పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని చెబుతూ బాధపడుతున్నారు. ఈ రోజు బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దక్షిణ అండమాన్ సముద్రం,దాని పరిసర ప్రాంతాలలో ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది తదుపరి 24 గంటల్లో పశ్చిమ-ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మరో 3, 4 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కాకినాడతో పాటు కృష్ ణాజిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఫలితంగా ప్రధాన రహదారులతోపాటు లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలు ప్రాంతాలకు రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో సగటున 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరి పంటలతో పాటు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు కలెక్టరేట్ నుంచి సమీక్షలు నిర్వహిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.