వేగంగా వచ్చిన ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధ దంపతులు మృతి

దంపతులను బలిగొన్న ఎమ్మెల్యే కారు

Last Updated : Aug 30, 2018, 02:28 PM IST
వేగంగా వచ్చిన ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధ దంపతులు మృతి

నందమూరి హరికృష్ణ పార్థివదేహానికి నివాళి అర్పించేందుకని హడావుడిగా హైదరాబాద్‌ బయల్దేరిన ఓ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు భార్యాభర్తలు మృతిచెందిన దుర్ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చోటుచేసుకుంది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు హైదరాబాద్ వెళ్లడం కోసం గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. సమయానికి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకోవాలనే హడావుడిలో ఎమ్మెల్యే రామారావు డ్రైవర్ కారుని వేగంగా పోనిచ్చే క్రమంలో అతివేగంగా దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు కేసరపల్లి సమీపంలో స్కూటీపై రోడ్డు క్రాస్ చేస్తోన్న బొట్ట హరినారాయణ రెడ్డి (65), సీతా మహాలక్ష్మి (60) అనే వృద్ధ దంపతులను అంతే వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీతా మహాలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, హరినారాయణ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

ఏమీ పట్టనట్టు వెళ్లిపోయిన ఎమ్మె్ల్యేపై స్థానికుల ఆగ్రహం:
ఎమ్మెల్యే పోతుల రామారావు ప్రయాణిస్తోన్న కారు కేసరపల్లి సమీపంలో దంపతులని ఢీకొన్న అనంతరం వెంటనే కారు దిగి ఆటో ఎక్కి గన్నవరం ఎయిర్‌ పోర్టుకు వెళ్లిపోయారు. తాను ప్రయాణిస్తోన్న కారు ప్రమాదంలో ఇద్దరు భార్యాభర్తలు గాయపడినప్పటికీ.. ఎమ్మెల్యే పోతుల రామారావు మాత్రం అదేమీ పట్టనట్లుగా తాను నింపాదిగా కారు దిగి మరో ఆటో ఎక్కి వెళ్లిపోవడంపై స్థానికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధ్యాతాయుతమైన హోదాలో ఉండి కూడా కొంచెమైనా మానవత్వం లేకుండా ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు తమని విస్తుపోయేలా చేసిందని స్థానికులు మండిపడ్డారు. 

ఒక పార్టీ తరపున గెలిచి.. మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యే పోతుల రామారావు:
2014 ఎన్నికల్లో కందుకూరు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పోతుల రామారావు అనంతరం 2016 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.

Trending News