)
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మరోసారి రాజకీయ వాగ్వాదం నెలకొంది. విపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. మహిళల గౌరవం గురించి బొత్స మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్, “మా తల్లిని నిండుసభలో అవమానించినప్పుడు మీకు గుర్తుకురాలేదా?” అంటూ నిలదీశారు.
లోకేశ్ మాట్లాడుతూ.. వైసీపీ నేతలకు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు. “మా మహిళలపై కేసులు పెట్టి, సభలో అవమానాలు చేసినప్పుడు మీరేం చేశారో ప్రజలే చూశారు” అని మండిపడ్డారు. తన తల్లిపై చేసిన దూషణ వల్ల కుటుంబం ఎదుర్కొన్న బాధను గుర్తుచేసుకున్న ఆయన, “ఆ అవమానం నుంచి కోలుకోవడానికి మా తల్లికి రెండు నెలలు పట్టింది. నా తల్లి పడిన ఆవేదన, బాధ నాకు బాగా తెలుసు. అలాంటి పరిస్థితిని నేను ప్రత్యక్షంగా చూశాను” అని అన్నారు.
ఇక వైసీపీ నేతలు ఇప్పుడు గౌరవం గురించి మాట్లాడటం ప్రజలకు అర్థం కావడం లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు. “తల్లిని అవమానించిన వాళ్లు ఇవాళ మహిళల రక్షణ గురించి ఎలా మాట్లాడగలరు? ఇది ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే” అంటూ మండిపడ్డారు.
లోకేశ్ వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ కూడా స్పందించారు. తల్లిని అవమానించడాన్ని తాను ఎప్పుడూ సమర్థించలేదని చెప్పారు. “ఆనాడు కూడా అదే అభిప్రాయంతోనే ఉన్నాను. కానీ ఆ సంఘటనను టీడీపీ రాజకీయంగా వాడుకుంటోంది” అని ఆరోపించారు.
ఇక ఈ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా బొత్సను తప్పుబట్టారు. “ఒక తల్లి పడిన బాధను మేము కూడా చూశాం. అప్పుడు ఆ తల్లిని అవమానించినప్పుడు మేమందరం కలత చెందాం. అలాంటి సందర్భాన్ని రాజకీయంగా వాడుకున్నారని బొత్స అనడం సరికాదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నారా లోకేశ్ భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర చర్చనీయాంశమవుతుండగా, బొత్స అనిత మధ్య మాటల యుద్ధం మరోసారి వాతావరణాన్ని వేడెక్కించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.