)
AP Politics: తెలుగుదేశం పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత.. అంత్యంత సీనియర్ నాయకుల్లో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు. 1982లో టిడిపి ఆవిర్భించిన సమయం నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి నెంబర్ టూ లీడర్ గా కొనసాగుతున్నారు. గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ట్రాక్ రికార్డు యనమల రామకృష్ణుడి సొంతం. పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. స్పీకర్ గా పనిచేశారు. లక్ష్మీ పార్వతి వర్గం విడిపోయినప్పుడు చంద్రబాబుకు అండగా ఉండి స్పీకర్ హోదాలో చంద్రబాబుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పబ్లిక్ ఎఫెక్ట్స్ కమిటీ చైర్మన్ హోదాలో క్యాబినెట్ హోదా పొందారు. గెలిచిన ప్రతిసారి క్యాబినెట్ ర్యాంకులోనే ఉన్నారు. అనంతరం శాసనసభ వదిలేసి శాసనమండలికి వెళ్లారు. అక్కడ తన మార్క్ చూపించారు..
అయితే 2014, 2019 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తుని నుంచి పోటీ చేసినా ఆయన అక్కడ వైసీపీ నేత దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2019లో వైసిపి అధికారంలోకి రావడంతో దాడిశెట్టి రాజాకు మంత్రి పదవి దక్కింది. అంతకుముందు దాడిశెట్టి రాజా ఎమ్మెల్యే గా గెలిచినా టిడిపి నేతలు ఆయన ఆటలను సాగనివ్వలేదనే టాక్ ఉంది. దీని వెనుక యనమల సోదరుడు కృష్ణుడు ఉన్నారనే ప్రచారం సైతం ఉంది. గతంలో యనమల రామకృష్ణుడు మంత్రిగా, స్పీకర్ గా కీలక పదవిలో ఉన్న సమయంలో కృష్ణుడే తుని రాజకీయాల్లో చక్రం తిప్పారని చెబుతున్నారు. ఇక 2024 ఎన్నికలకు ముందు కృష్ణుడు అన్న రామకృష్ణుడితో విభేదించారు. దాంతో యనమల ఆయన కుమార్తె దివ్యను పాలిటిక్స్ లోకి తీసుకొచ్చారు. ఆమెను తుని టిడిపి ఇంచార్జ్ అంటూ ప్రకటన చేశారు. దీంతో యనమల బ్రదర్స్ మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. చివరకు యనమల కృష్ణుడు వైసీపీలో చేరిపోయారు. ఇక 2024 కూటమి గాలిలో ఆయన కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా విజయం సాధించారు..
ఇదిలా ఉంటే గతేడాది కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో.. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న యనమల రామకృష్ణుడు మంత్రి పదవిని ఆశించారు. మరోవైపు ఆయన ఎమ్మెల్సీ పదవి కాలం కూడా దగ్గర పడుతుండటంతో మంత్రి పదవిపై ఆశలు సన్నగిల్లాయి. దాంతో కనీసం గవర్నర్ లేదా రాజ్యసభకు అయినా పంపిస్తారని ఆశపడ్డారు. కానీ యనమలకు ఇప్పటివరకు ఏ పదవి దక్కలేదు. చివరకు ఆయన ఎమ్మెల్సీ పదవి కాలం కూడా పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఎస్ఈ జెడ్ నేపథ్యంగా ఓ పక్క పవన్, మరొపక్క చంద్రబాబుకు విమర్శలు తగిలేలా లేఖాస్త్రాన్ని సంధించారు.
దాంతో పవన్ కళ్యాణ్ తో విభేదాలు వస్తాయని సీఎం చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా యనమలను పూర్తిగా సైడ్ చేశారు. కానీ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కింది. కానీ యనమలకు మాత్రం నిరాశే ఎదురైంది. వాస్తవానికి యనమలకు ఇటు లోకేష్, అటు పవన్ కళ్యాణ్ తో పొసగడం లేదన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. ఒక్కసారి కూడా ఆయన పవన్ తో నేరుగా కలిసిన సందర్భం లేదని ఎన్నికల సమయంలో పవన్ తో కలిపి తిరిగిన సంఘటన కూడా లేవు. పవన్ తుని పర్యటన లో కుమార్తె దివ్య మాత్రమే వేదికపై కనిపించారు. అటు పవన్ కళ్యాణ్ పై యనమల అసహనంగా ఉన్నట్లు ఇప్పటికీ స్థానిక నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
ప్రస్తుతం తుని నియోజకవర్గంలో జనసేనకు ఇంచార్జ్ లేరు.. యనమల కారణంగానే అక్కడ జనసేన ఇంచార్జ్ను పెట్టలేదన్న చర్చ ఉంది. ప్రస్తుతం యనమల నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారు. చివరికి జిల్లా రాజకీయాల జోలికి కూడా పోవడం లేదు. కానీ గతంలో తనకు నచ్చని వారిని పార్టీ నుంచి వెళ్ళిపోయేలా చేశారని ఆయన వల్లే తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రు లాంటి లీడర్లు బయటకు వెళ్లారనే టాక్ ఉంది. ఇప్పుడు మాత్రం కూతురు దివ్యని ముందు పెట్టారు. ఆమె ఎమ్మెల్యేగా తిరుగుతున్నారు. మొత్తం నియోజవర్గంలో ఈసారి పూర్తిగా యనమల జోక్యం చేసుకుంటున్నారు. సోదరుడు కృష్ణుడు వైసీపీలోకి వెళ్లడంతో ఆయనకు రాజకీయ జీవితం లేకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నారని ప్రచారం సాగుతోంది. అందుకే తుని మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లను మూకుమ్మడిగా టీడీపీలో చేర్చుకుని వైసీపీ నేతలకు షాక్ ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు మరోసారి పదవుల జాతరకు తెరలేవడంతో తన తమ్ముడి మార్క్ లేకుండా నేతలను ఎంపిక చేస్తున్నారని అంటున్నారు.
ఇప్పుడు తునిలో మార్కెట్ కమిటీల నియామకం జరుగుతోంది. ఈ పదవుల విషయంలో యనమల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తనను నమ్ముకున్న వారికి పెద్దపేట వేస్తున్నారు. తద్వారా తన రాజకీయ వారసురాలు దివ్యనే కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద యనమల రాష్ట్ర రాజకీయాలు వదిలేసినప్పటికీ తునిలో మాత్రం పట్టు సడలకుండా మరింత పట్టు బిగిస్తున్నారని చెబుతున్నారు. అసలు యనమల వ్యూహం ఏమిటి.. జిల్లా పార్టీ సమావేశాలకు ఎందుకు హాజరుకావడం లేదన్నది చర్చ. అటు జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న నారాయణ జిల్లాకు వచ్చినప్పుడు కూడా యనమల కలవడం లేదు. మొత్తం మీద యనమల వ్యూహం తెలియక పార్టీ నేతలు చివరికి అధిష్టానం కూడా తల పట్టుకుంటోంది అన్నది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.