మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో గెలుపొందిన రేవంత్ రెడ్డి తన మనసులో మాటను మీడియాతో పంచుకున్నారు. తనను ఎంపీగా ఎన్నుకున్న మల్కాజ్గిరి వాసులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తొలి ప్రాధాన్యత నియోజకవర్గంలో సమస్యల్ని పరిష్కరించడమేనన్నారు.
మల్కాజ్గిరి ప్రాంతాన్ని నోయిడా తరహా అభివృద్ధి చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా విభజన హామీల అమలుతో పాటు తెలంగాణకు రావాల్సిన జాతీయ ప్రాజెక్టులు, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఉక్కు కర్మాగారం, గిరిజన వర్సిటీ తదితర అంశాలపై తాను పార్లమెంట్లో గళం ఎత్తుతానని తెలిపారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక వైపు ఎంపీగా తన బాధ్యత నెరవేర్చుతూనే తెలంగాణ ప్రజల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం కొనసాగిస్తానన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీస్తాన్నారు.