)
Sangameswaram:మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో నీటిమట్టం ప్రస్తుతం 838 అడుగులకు చేరింది. దీంతో సంగమేశ్వర క్షేత్రం నీట మునిగింది. ఏడాదిలో కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే సంగమేశ్వర క్షేత్రం మరోసారి నీట మునిగింది.
మరో 8 నెలల పాటు ఈ ఆలయం నదీ గర్భంలోనే ఉండనుంది. ప్రతి ఏటా కృష్ణమ్మ ఒడిలో సంగమేశ్వరుడు ఒదిగిపోయే అపురూప దృశ్యాలు తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
23 సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఎనిమిది నెలలు నీటి లోనే వుండి.. అనంతరం శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గిపోతే క్రమేణా బయట పడుతూ.. మిగిలిన నాలుగు నెలలు భక్తులకు దర్శనమిస్తూ పూజలందుకుంటాడు సంగమేశ్వరుడు. అయితే ఈ సంవత్సరం ముందుగానే కృష్ణ బ్యాక్ వాటర్ రావడంతో కేవలం 80 రోజుల కాలంలోనే ఆలయం మునిగిపోవడం ఇదే మొదటిసారి.
మార్చి 22 ఆదివారం నాడు సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా బయటపడి మళ్లీ జూన్ 15 ఆదివారం నాడు స్వామివారు జలాధివాసం చేయడం విశేషం.ఏడు నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపమైన వేపదారు శివ లింగాన్ని సందర్శిస్తే నరకలోక ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చునని భక్తులు నమ్ముతారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 860 అడుగులకు చేరడంతో సంగమేశ్వర ఆలయం శిఖరం మినహా పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుకుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. ఇక వర్ష రుతువు ప్రారంభం కావడంతో జులై ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో వర్షాలు బాగా పడి రైతులకు మంచి చేకూరుతుందని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.