ప్రముఖ సినీ నటి, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఏపీ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న వైఎస్సార్సీపీ నేత ఆర్కే రోజా తన నియోజకవర్గ ప్రజల కోసం నేడు ఓ సరికొత్త మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. ‘మై ఎమ్మెల్యే-రోజా సెల్వమణి’ పేరుతో రూపొందిన ఈ యాప్ ద్వారా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకురావచ్చని ఆమె తెలిపారు. యాప్ లాంచింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోజా.. నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకే తాను ఈ యాప్ను తీసుకొచ్చానని చెప్పారు. గత నాలుగున్నరేళ్లలో నగరి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీ హోదాలో వైఎస్సార్సీపీ చేసిన కృషిని మై ఎమ్మెల్యే-రోజా సెల్వమణి యాప్ ద్వారా ప్రజల ముందుకు తీసుకెళతామన్నారు.
అవసరమైతే, ఈ యాప్ ద్వారా అపాయింట్మెంట్ కూడా తీసుకునే విధంగా యాప్ని రూపొందించినట్టు రోజా తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం నగరిలో మంచినీటి సౌకర్యం కల్పించామనీ, ఆహారం కోసం అలమటించే నిరుపేదల కోసం వైఎస్సార్ క్యాంటీన్లను ప్రారంభించామని చెప్పిన రోజా... తాము ఏం చేసినా సైలెంట్గా చేసుకుపోతున్నామని, అయితే, టీడీపీ నేతలు మాత్రం ఏం చేయకున్నా ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆమె అధికారపక్షంపై విమర్శలు గుప్పించారు.