AP Aqua Sector: డొనల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లతో ఏపీ ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడంతో రైతులు ఇబ్బందులు పడుతుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అని సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అమెరికా టారిఫ్ల దెబ్బ ఒకటైతే.. ఆపేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: YS Sharmila: 'ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా.. వైఎస్ జగన్ నీచపు చేష్టలు'
రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? మాజీ సీఎం వైఎస్ జగన్ నిలదీశారు. ప్రభుత్వ స్థాయిలో ఒక సమీక్ష చేసి చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? అని ప్రశ్నించారు. రైతులంతా గగ్గోలు పెడితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? అని తప్పుబట్టారు. ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం? అని మండిపడ్డారు. '100 కౌంట్ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200- 210కి పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా క్రాప్ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?' సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
Also Read: AP Aqua Industry: 'డొనల్డ్ ట్రంప్ దెబ్బకు అల్లాడుతున్నాం.. కాపాడండి': సీఎం చంద్రబాబు లేఖ
'కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతి పంటకూ గిట్టుబాటు ధర లేదు. దళారులు రైతుల కష్టాన్ని దోచుకుతింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. 'సమస్యలను ప్రస్తావిస్తే ఎదురుదాడి చేసి తప్పించుకోవడం తప్ప ఎక్కడా బాధ్యత తీసుకోవడం లేదు. ఇప్పుడు ఆక్వా విషయంలోనూ అంతే అని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
'ఎగుమతుల్లో.. విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ రాష్ట్ర ఆక్వారంగం దేశంలోనే నంబర్ వన్. అలాంటి రంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని మేం ఏర్పాటు చేశాం. ఆక్వా సీడ్, ఫీడ్ ధరలను నియంత్రించడంతోపాటు నాణ్యత పాటించేలా ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చాం' అని వైఎస్ జగన్ గుర్తుచేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రొయ్యలకు ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. ఫీడ్ ధరల విషయంలో అనేక నిర్ణయాలు తీసుకున్నామని.. నియంత్రణ బోర్డు అందుబాటులో ఉన్నాసరే ధరలు తగ్గడంలేదని పేర్కొన్నారు.
'గతంలో ఆక్వాజోన్ పరిధిలో కేవలం 80-90వేల ఎకరాలు ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 4.22 లక్షల ఎకరాలు తీసుకువచ్చాం. ఆక్వా రంగంలో విద్యుత్ కనెక్షన్లకు రూ.1.50కే యూనిట్ కరెంటు అందించాం. దీనికోసం రూ.3,640 కోట్లు రాయితీ కింద ఖర్చుచేశాం' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఆక్వాజోన్స్లో ఉన్న ఆర్బీకేల్లో ఫిషరీస్ గ్రాడ్యుయేట్లను ఆక్వా అసిస్టెంట్లుగా నియమించినట్లు చెప్పారు. 'ఇప్పటికైనా కళ్లు తెరవండి చంద్రబాబు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి.. ధరల పతనాన్ని అడ్డుకోవాలని సూచించారు. అమెరికా టారిఫ్ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









