AP Petrol And Diesel Price: దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తగ్గించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. తన సోదరుడు వైఎస్ జగన్ మాదిరి చంద్రబాబు కూడా నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీటర్కు రూ.17 తగ్గించాలని వైఎస్ షర్మిల సంచలన డిమాండ్ చేశారు.
Also Read: Chandrababu: వేసవిపై సీఎం చంద్రబాబు అలర్ట్! అధికారులకు కీలక ఆదేశాలు
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను వైఎస్ షర్మిల కోరారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికలో ఆమె పోస్టు చేశారు. 'రాష్ట్రంలో ఇవాళ పెట్రోల్ ధర రూ.109.60, డీజిల్ ధర రూ 97.47 ఉన్నాయి. తమిళనాడులో లీటర్ పెట్రోల్ రూ.100, డీజిల్ రూ.92 ఉంది. అంటే తమిళనాడుతో పోల్చితే మనదగ్గర పెట్రోల్ మీద రూ.9, డీజిల్ మీద రూ.5 అధికంగా ఉంది' అని షర్మిల వివరించారు.
Also Read: TTD Board Meeting: తిరుమలలో 'వీఐపీ సంస్కృతికి' బ్రేక్? టీటీడీ పాలకమండలి నిర్ణయాలు ఇవే!
కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.90, డీజిల్ రూ.88.99 ఉంది. కర్ణాటకతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద లీటర్కు రూ.7, డీజిల్ మీద రూ.9 అధికంగా ఉంది. పక్కనున్న తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర.రూ 107.46, డీజిల్ రూ.95.70. తెలంగాణతో పోల్చినా ఏపీలో లీటర్ మీద రూ.3 అదనం. పన్నులు ఘనం.. అభివృద్ధి శూన్యం ఇది రాష్ట్ర పరిస్థితి' అని కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
'పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారపక్షంలో మరో మాట చేస్తున్నాయి' అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. పదేళ్లుగా రెండు పార్టీల ప్రభుత్వాలు దారి దోపిడీ తప్ప మరొకటి చేయలేదు. వ్యాట్ పేరుతో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రజలపై పన్ను పోటు విధించారు. దేశంలోనే అత్యధిక పన్నులు వేసిన రాష్ట్రంగా ముందువరసలో పెట్టి.. రాష్ట్ర ప్రజానీకాన్ని లూటీ చేశారు' అని వైఎస్ జగన్తోపాటు చంద్రబాబుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు మొదటి ఐదేళ్ల పాలనలో సుమారు రూ.20 వేల కోట్ల మేర అదనపు పన్నులు వసూళ్లు చేస్తే.. వైఎస్ జగన్ అధికారం ఇస్తే ఆయనే బాదుడుకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఇద్దరు కలిసి పదేళ్లలో ప్రజల నుంచి రూ.50 వేల కోట్లు బాదేశారు' అని సంచలన ఆరోపణలు చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. లీటర్కు రూ.17 తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారో సమాధానం చెప్పాలి' అని సీఎం చంద్రబాబును షర్మిల డిమాండ్ చేశారు. రూ.17లు ధర తగ్గించి హామీ నిలబెట్టుకోవాలని సీఎం చంద్రబాబుకు సవాల్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









