
YS Sharmila Fires on PM Modi: బీజేపీ నాయకులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఏపీలో వైసీపీ ఉన్నా.. కూటమి ఉన్నా అధికార పెత్తనం మాత్రం బీజేపీదేనని అన్నారు. గత పదకొండేళ్లుగా రాష్ట్రాన్ని మోడీ నాశనం చేశారని.. టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులూ ఎలాగూ పశ్నించరని.. మోడీ మోసాలను నిలదీస్తే తనను టార్గెట్ ఛేసి దాడి చేయిస్తారా..? అని నిలదీశారు. కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేస్తారా..? ఏఐసీసీ అధ్యక్షురాలి పనే ఇలా దాడికి తెగబడితే.. కాంగ్రెస్ నాయకులు పరిస్థితి ఏమిటి..? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపలకు వచ్చారంటే పోలీసులు సహకారం లేకుండా వస్తారా..? ఎవరైతే ఇప్పుడు దాడిలో ఉన్నారో అందరి పైనా హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అన్యాయాలను ప్రశ్నిస్తే సహించలేరా.. మోసాలు బయట పెడితే దాడి చేస్తారా..? అంటూ ధ్వజమెత్తారు. ఈ ఘటనలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం, పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
"10 ఏళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. టీడీపీ, వైసీపీలు మోడీకి బానిసలుగా పని చేశారు. 2015 లో మోడీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. హట్టహాసంగా శిలాఫలకం వేశారు. ఇప్పుడు అక్కడ చెట్లు, పుట్టలు తప్పా ఏమి లేవు. అక్కడ వెళ్ళి చూడటానికి మీరెందుకు బయపడుతున్నారు. వచ్చేటప్పుడు మోడీ మట్టి చేతులతో వచ్చారు. పార్లమెంట్ మట్టి, యమునా నీళ్ళు తెచ్చారు. ఆ రోజు మోడీ చెప్పిన మాట.. ఊరికే రాలేదు అన్నాడు. లాంఛన ప్రాయంగా తెచ్చింది కాదు అన్నాడు. రాజధాని అమరావతికి వచ్చినట్లు అని చెప్పాడు. అమరావతి ప్రగతి కోసం భుజం భుజం కలిపి పని చేస్తాం అన్నాడు.
ఆకాశం అన్నంత మాటలు చెప్పాడు. ఢిల్లీ తలదన్నే రాజధాని కడతాం అని హామీ ఇచ్చాడు. 10 ఏళ్లలో మోడీ ఇచ్చింది మట్టి మాత్రమే. తెచ్చిన మట్టి మా మొహం మీద కొట్టారు. 10 ఏళ్లలో కనీసం 10 సార్లు కూడా రాలేదు. కనీసం 10 సార్లు కూడా రివ్యూ చేయలేదు. అమరావతి కి 10 ఏళ్లలో కనీసం 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. 10 ఏళ్లలో చేసిన మోసం చాలదని ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు..?. రాజధాని భారం మీదే అని చెప్పారు. 10 ఏళ్లలో వెనక్కి తిరిగి చూస్తే ఒరిగింది ఏమి లేదు. 10 ఏళ్లలో మొదటి 5 ఏళ్లు రియల్ మాఫియా చేశాడు. రాజధానిపై గ్రాఫిక్స్ చూపించాడు. సింగపూర్, మలేషియా అన్నాడు. తీరా చూస్తే అక్కడ రెండు మూడు తాత్కాలిక భవనాలు తప్పా ఏమి లేదు
తర్వాత మోడీతో బాబు తెగదెంపులు చేసుకున్నారు. మోడీ మోసం చేశాడు అని చెప్పాడు. మోడీకి బ్రిటిష్ వాళ్ళకి తేడా లేదు అని బాబు ఆరోపణలు చేశాడు. ఇక దత్త పుత్రుడు జగన్ రాజధానిని పడావ్ పెట్టాడు. మూడు ముక్కల ఆట లెక్క జగన్ మూడు రాజధానుల ఆట ఆడాడు. చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్లు.. రాజధాని కి శంకుస్థాపన మళ్ళీ మళ్ళీ. అనాడు ఆయనే ప్రధాని.. ఇక్కడ ఆయనే సీఎం. ఇందులో కొత్త ఏముంది అన్నట్లు ఉంది వీళ్ళ తీరు. ఆనాడు మట్టి కొట్టాడు...ఇప్పుడు సున్నం కొడతాడు. వీళ్లకు రాజధాని కట్టే ఆలోచన లేదు. రాజధాని విభజన హామీ. కేంద్రం రాజధాని కట్టించి ఇవ్వాలి. రాజ్యసభ వేదికగా అనాడు ప్రధాని ఏపీకి రాజధాని కేంద్రం బాధ్యత అని చెప్పాడు. మోడీ కోసం ఆంధ్రా రాష్ట్రం ఎంతో చేసింది. కానీ మోడీ మన రాష్ట్రాన్ని మోసం చేస్తూనే ఉన్నారు.
10 ఏళ్లలో రాజధాని కి మోడీ ఇచ్చింది కేవలం 15 వేల కోట్ల రుణం మాత్రమే. రుణం గ్యారెంటీ ఇచ్చి పెద్ద ఉద్ధరించినట్లు చేస్తున్నారు. చంద్రబాబు గారిని అడుగుతున్నాం.. అప్పులతో రాజధాని ఎందుకు కట్టాలి..? కేంద్రం ఇచ్చిన హామీ మీద ఎందుకు నిలదీయరు..? మోడీ వేసే కుక్క బిస్కెట్లకు ఆశ పడుతున్నారా..? మోడీ సలహా ఇచ్చాడట.. ఇదివరకు.. ఢిల్లీ మోడల్ అన్నాడు.. ఇప్పుడు జపాన్ మోడల్ అంటున్నాడు. రాజధాని అంటే బిల్లింగులు కాదు.. చెట్లు కూడా కావాలని అన్నాడట. రాజధానికి కావాల్సింది మట్టి, నీళ్లు కాదు.. రాజధాని నిర్మాణానికి కనీసం 2 లక్షల కోట్లు కావాలి. అప్పులు కాకుండా పూర్తి స్థాయి నిధులు వెంటనే ఇవ్వాలి. ఈ నెల 2న వస్తున్న మోడీని డిమాండ్ చేస్తున్నాం. బేషరతుగా రాజధాని నిర్మాణానికి 1.50 లక్షల కోట్లు ఇవ్వాలి. వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలి." అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.