Govt Scrap Sale: స్వచ్ఛ భారత్ అభియాన్ కేవలం పరిశుభ్రత కార్యక్రమం మాత్రమే కాదు, ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా కూడా మారింది. ఈ కార్యక్రమం కింద, వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు వాడుకలో లేని పాత వస్తువులు, పత్రాలు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, స్క్రాప్ను విక్రయించడం ద్వారా భారీ మొత్తంలో ఆదాయం సంపాదించాయి.
తాజా నివేదికల ప్రకారం.. 2025లో జరిగిన స్పెషల్ స్వచ్ఛతా అభియాన్ 5.0 లో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 800 కోట్లు సంపాదించింది. ఈ క్లీనింగ్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోని 232 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీ చేసింది. అనవసర ఫైళ్లు, పాత ఫర్నీచర్, చెత్త వస్తువులు తొలగించడం ద్వారా ఆఫీసుల్లో పని వాతావరణం మరింత పరిశుభ్రంగా, క్రమబద్ధంగా మారింది.
ఈ ప్రచారం కేవలం ఒక నెలపాటు మాత్రమే సాగింది. అక్టోబర్ 2 నుండి 31 వరకు నిర్వహించారు. ఈ కాలంలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి 29 లక్షలకు పైగా పాత ఫైళ్లు తొలగించారు. మొత్తం 11.58 లక్షల కార్యాలయ ప్రాంతాలు ఈ శుభ్రతా కార్యక్రమంలో భాగం అయ్యాయి. ఈ కార్యక్రమాన్ని పరిపాలనా సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం (DAR&PG) సమన్వయం చేసింది. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మొదటి క్లీన్లీనెస్ డ్రైవ్ 2021లో ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తం రూ. 4,100 కోట్లకు పైగా ఆదాయం స్క్రాప్ అమ్మకాల ద్వారా సంపాదించింది. ఈ మొత్తంలో ఒక ముఖ్య భాగం ఈ-వేస్ట్, తుక్కు వస్తువుల అమ్మకం ద్వారా వచ్చింది. అధికారుల వివరాల ప్రకారం, గత నాలుగేళ్లలో ప్రభుత్వానికి రూ. 3,296.71 కోట్లు ఆదాయం ఈ-వేస్ట్, స్క్రాప్ అమ్మకాల ద్వారా లభించింది. అంతేకాకుండా, 696.27 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం శుభ్రపరిచింది.
ఈ మహా కార్యక్రమంలో మొత్తం 84 మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు పాల్గొన్నాయి. దీన్ని ముగ్గురు కేంద్ర మంత్రులు డా. జితేంద్ర సింగ్, మన్సుఖ్ మాండవీయ, కె. రామ్ మోహన్ నాయుడు సమన్వయం చేశారు. కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా, ఢిల్లీ నెహ్రూ పార్క్లో జరిగిన స్పెషల్ స్వచ్ఛతా అభియాన్ 5.0 లో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ ఈ ప్రచారం ప్రభుత్వ పాలనలో ప్రజా సేవలలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని అన్నారు.
గత దశల్లో దేశవ్యాప్తంగా 137.86 లక్షలకు పైగా పాత ఫైళ్లు తొలగించాయి. అలాగే 12 లక్షలకుపైగా కార్యాలయ స్థలాలు శుభ్రం చేశాయి. ఈ ప్రయత్నం వలన ప్రభుత్వ కార్యాలయాల్లో శుభ్రత పెరిగింది. స్థల వినియోగం మెరుగుపడింది, అలాగే పర్యావరణ పరిరక్షణకు కూడా సహకారం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ ఆలోచన ఇప్పుడు పరిశుభ్రతతో పాటు సమర్థ పరిపాలన (Good Governance) కు మార్గం చూపే సంస్కరణాత్మక ఉద్యమంగా మారింది. ఇది కేవలం శుభ్రతకే పరిమితం కాకుండా, వనరులను సద్వినియోగం చేసుకోవడం, పాత ఆస్తులను మళ్లీ విలువైనవిగా మార్చడం వంటి మంచి పరిపాలనా పద్ధతులకు కొత్త దిశను చూపుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









