
GST for Diabetes Patients: కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న జీఎస్టీ సంస్కరణలు సామాన్య ప్రజలకు ఊరటను కలిగించనున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు ఇది పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఇప్పటివరకు గ్లూకోమీటర్లు, టెస్ట్ స్ట్రిప్స్, ఇన్సులిన్, కొన్ని ఓరల్ మెడిసిన్స్పై 12శాతం పన్ను అమలులో ఉండేది. కానీ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఇది కేవలం 5శాతం మాత్రమే అవుతుంది. ఈ మార్పు వల్ల రోగుల వైద్య ఖర్చులు భారీగా తగ్గబోతున్నాయని చెప్పవచ్చు.
డయాబెటిస్ పేషెంట్లు తరచూ గ్లూకోస్ స్థాయిలను టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక గ్లూకోమీటర్ ధర సుమారు రూ. 1,000 నుంచి రూ. 2,000 మధ్య ఉంటుంది. కొత్త జీఎస్టీ రేటుతో ఒక్కో పరికరంపై కనీసం రూ. 70 నుంచి రూ. 140 వరకు ఆదా అవుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఉపశమనంగా భావించవచ్చు. ఇది గ్లూకోమీటర్లకే పరిమితం కాకుండా, ఇన్సులిన్ ఇంజెక్షన్లు, టెస్ట్ స్ట్రిప్స్, ఓరల్ డయాబెటిస్ టాబ్లెట్లు వంటి మరిన్ని ఉత్పత్తులపై కూడా వర్తిస్తుంది. దీంతో నెలవారీ మెడికల్ బిల్లులు తగ్గడం ఖాయం అవ్వడంతో రోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. వైద్యులు చెబుతున్నట్లు, ఈ సంస్కరణలు రోగుల ఆరోగ్య సంరక్షణను మరింత సరసమైనదిగా మార్చబోతున్నాయి.
కేవలం డయాబెటిస్ మాత్రమే కాకుండా, క్యాన్సర్ వంటి మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై కూడా జీఎస్టీ తగ్గించారు. కొన్ని ముఖ్యమైన మందులపై పన్ను శాతం 12శాతం నుంచి 5శాతానికి, కొన్ని సందర్భాల్లో పూర్తిగా (0%)కి తగ్గించారు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA అభినందించింది.
జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల ఆమోదం తెలిపిన కొత్త పన్ను నిర్మాణం రెండు ప్రధాన స్లాబ్లతో (5శాతం, 18శాతం) అమల్లోకి రానుంది. లగ్జరీ వస్తువులు, సిగరెట్లు వంటి వాటికి ప్రత్యేకంగా 40శాతం పన్ను స్లాబ్ను ఉంచారు. కానీ ప్రజల ఆరోగ్యానికి అవసరమైన ఔషధాలు, పరికరాలకు తక్కువ పన్ను రేట్లు వర్తించడం వల్ల ఇది దీపావళి బహుమతిగా భావిస్తున్నారు. ఈ సంస్కరణలు ఆరోగ్య రంగానికే కాకుండా వ్యవసాయం, టెక్స్టైల్, రిన్యూవబుల్ ఎనర్జీ వంటి అనేక రంగాలకు ఉపయోగకరంగా ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎస్బీఐ రీసెర్చ్ అంచనా ప్రకారం, ఈ మార్పులు ఆర్థిక వ్యవస్థలో దాదాపు రూ. 1.98 లక్షల కోట్ల వినియోగ వృద్ధిని ప్రోత్సహించవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ చర్యలు ప్రభావం చూపబోతున్నాయి. గ్లూకోమీటర్లు, టెస్ట్ స్ట్రిప్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉంటే, రక్తంలో చక్కెర స్థాయిలను తరచుగా పరీక్షించడం సులభమవుతుంది. ఇది డయాబెటిస్ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి నివారించడానికి సహాయపడుతుంది. మొత్తానికి, జీఎస్టీ తగ్గింపుతో డయాబెటిస్ పేషెంట్ల వైద్య ఖర్చులు తగ్గడమే కాకుండా, ఆరోగ్య సంరక్షణ మరింత సులభంగా, అందుబాటులో ఉండేలా మారబోతోంది. ఇది ఆరోగ్యరంగానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే ఒక కీలకమైన అడుగుగా భావించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.