)
USA Flight Ticket Prices: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ ఐటీ వర్గాలకే కాదు.. అమెరికా వెళ్లే ప్రయాణికులకు కూడా పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు లక్షలాది మంది ఉద్యోగులు ఎన్నో కలల కంటూ దరఖాస్తు చేసే హెచ్-1బీ వీసా రుసుమును ఒక్కసారిగా 1 లక్ష డాలర్లు (రూ.88 లక్షలు)కు పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనతో అమెరికా అంతటా ఎయిర్ పోర్టుల్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ముఖ్యంగా అక్కడి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద పెద్దెత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి.
ట్రంప్ ఈ నిర్ణయాన్ని అమలు చేసే గడువును ఈ నెల 21వ తేదీ ఉదయం 9.31 గంటలుగా నిర్ణయించారు. ఈ టైమ్ లిమిట్ను చాలా తక్కువగా ఇవ్వడం వల్ల అమెరికా వెళ్లే ప్రయాణికులు, ముఖ్యంగా భారతీయులు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికే దుర్గా పూజల కోసం ఇండియాకు బయలుదేరిన వారు ఈ వార్త విన్న వెంటనే తమ విమానాల నుంచి దిగిపోయి ప్రయాణం రద్దు చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఎయిర్పోర్టుల వద్ద పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
ఈ నిర్ణయం ప్రభావం కేవలం వీసాలపైనే కాకుండా ఎయిర్ టికెట్ ధరలపై కూడా పడింది. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే విమానాల ధరలు ఒక్కసారిగా దాదాపు రెట్టింపు అయ్యాయి. ఉదాహరణకు.. న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే టికెట్ ధర గతంలో రూ.37,000 ఉండగా, ఇప్పుడు అది రూ.70,000 నుంచి రూ.80,000 వరకు పెరిగింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే, ట్రంప్ ప్రకటన వెలువడిన రెండు గంటల్లోనే ఈ పెరుగుదల కనిపించడం గమనార్హం.
హెచ్-1బీ వీసా ఇప్పటివరకు భారతీయుల కోసం అమెరికా ఉద్యోగాలకు ప్రధాన ద్వారంగా నిలిచింది. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్కేర్ రంగాల్లో పనిచేసే లక్షలాది మంది ప్రొఫెషనల్స్ ఈ వీసా ద్వారా అమెరికాలో ఉద్యోగాలను సాధించారు. అయితే ఇప్పుడు ఛార్జీలు పెంపుతో అది మధ్యతరగతి కుటుంబాలకు అందని ద్రాక్షగా మారనుంది. సాధారణంగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ఎక్కువ శాతం భారతీయులే ఉన్నారు. కాబట్టి ఈ నిర్ణయం వారికి భారీ భారమని నిపుణులు అంటున్నారు.
అదే సమయంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం పై అమెరికా రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తున్న ట్రంప్ ప్రభుత్వం, దేశీయ ఉద్యోగాలను అమెరికన్లకే కేటాయించాలని భావిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీని వలన అమెరికా ఐటీ రంగం ప్రతిభావంతులైన వర్కర్లను కోల్పోతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తానికి, ట్రంప్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం భారతీయ ఉద్యోగులు, విద్యార్థులు, అలాగే అమెరికా వెళ్లే ప్రయాణికులకు పెద్ద దెబ్బగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే విమాన టిక్కెట్ ధరలు పెరగడం, వీసా ఛార్జీలు ఆకాశాన్నంటడం వల్ల రాబోయే నెలల్లో అమెరికా ప్రయాణం మరింత ఖరీదైనదిగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.