)
RBI New Rules: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మరణించిన కస్టమర్ల బ్యాంక్ ఖాతాలు, సేఫ్ డిపాజిట్ లాకర్లు, సేఫ్ కస్టడీలో ఉంచిన వస్తువులకు సంబంధించిన క్లెయిమ్ల పరిష్కారంపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కొత్త నియమాలు 2026 మార్చి 31 నాటికి అన్ని బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. కస్టమర్లు,వారి కుటుంబ సభ్యులకు ఇది ఒక పెద్ద ఉపశమనం అవుతుందని తెలిపింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి క్లెయిమ్లను పరిష్కరించడంలో ఆలస్యాలు, ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యేవి. ఈ నిబంధనతో అవి మరింత సులభతరం కానుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, మరణించిన కస్టమర్కు సంబంధించిన క్లెయిమ్ వచ్చిన వెంటనే బ్యాంకులు దానిని 15 రోజుల్లోపు పరిష్కరించాలి. బ్యాంకులు ఆలస్యం చేస్తే, కస్టమర్కు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యానికి సరైన కారణం లేకపోతే బ్యాంకులు వడ్డీతో పాటు నష్టపరిహారం చెల్లించాలి. ఈ వడ్డీ రేటు బ్యాంకు ప్రస్తుత రేటుకు అదనంగా సంవత్సరానికి కనీసం 4శాతం ఉంటుందని పేర్కొంది.
ఖాతాలో నామినీ లేదా సర్వైవర్ క్లాజ్ ఉంటే, బ్యాంకు నేరుగా వారికి చెల్లింపు చేస్తుంది. ఇంతటితో ఆ ఖాతా సంబంధిత బాధ్యత ముగిసినట్లుగా పరిగణిస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యులు కోర్టు లేదా అదనపు పత్రాల కోసం తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఖాతాలో నామినీ లేకపోతే ఆర్బీఐ ఒక సరళమైన విధానాన్ని సూచించింది. సహకార బ్యాంకుల విషయంలో రూ.5 లక్షల లోపు, ఇతర బ్యాంకుల విషయంలో రూ.15 లక్షల లోపు మొత్తాల క్లెయిమ్లకు పెద్దగా చట్టపరమైన పత్రాలు అవసరం ఉండదు. ఈ పరిమితిని మించి క్లెయిమ్ ఉంటే, వారసత్వ సర్టిఫికేట్ లేదా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వంటి పత్రాలను బ్యాంకు అడిగే అవకాశం ఉంటుంది.
లాకర్లు లేదా సేఫ్ కస్టడీలో ఉంచిన వస్తువులకు సంబంధించిన క్లెయిమ్లను కూడా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టతనిచ్చింది. అవసరమైన పత్రాలు అందిన 15 రోజుల్లోపు బ్యాంకు ప్రాసెస్ చేయాలి. లాకర్ను తెరిచే సమయంలో, క్లెయిమ్దారుని హాజరు పరచి వస్తువుల జాబితా సిద్ధం చేయాలి. ఆలస్యం జరిగితే బ్యాంకు రోజుకు రూ.5,000 పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, క్లెయిమ్ ప్రాసెసింగ్ ఆలస్యం చేస్తే బ్యాంకులు కారణం చెప్పాలి. బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల ఆలస్యం అయితే, కస్టమర్కు పరిహారం తప్పనిసరిగా అందించాలి. ఈ విధానం అమలులోకి వస్తే, కస్టమర్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది లేకుండా సులభంగా తమ హక్కులు పొందగలుగుతారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఈ కొత్త నియమాలు బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతను మరింత పెంచుతాయి. మరణించిన కస్టమర్ల కుటుంబాలకు ఇది పెద్ద సహాయంగా మారనుంది. 2026 మార్చి 31 తర్వాత అన్ని బ్యాంకులు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.