
TFCC:జమ్మూ కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ సమీపంలోని బైరసన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో క్యాబినేట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ దీనిపై లోతుగా విశ్లేషించింది. అంతేకాదు పాకిస్థాన్ తో ఇకపై ఎలాంటి దౌత్యపరమైన చర్చలకు ఆస్కారమే లేదని తేల్చిచెప్పింది. మన దేశంలో పర్యటిస్తున్న పాక్ పౌరులు వారం రోజుల్లో మన దేశం వదిలి వెళ్లాలని ఆల్టీమేటం జారీ చేసింది. అంతేకాదు పాకిస్థాన్ తో ఉన్న ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
ఆ సంగతి పక్కన పెడితే.. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా అగ్ర దేశాలన్ని ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. తాజాగా ఈ నెల 22న జరిగిన భీకరమైన ఉగ్రదాడిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో దాదాపు 30 మంది అమాయక పర్యాటకులు, వారిలో ఇద్దరు విదేశీయులు, ఒక నేవీ అధికారి మరియు ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి సహా అనేక మంది అసువులు బాసారు. ఈ కిరాతక దాడి మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన హేయమైన చర్యగా మేము భావిస్తున్నట్టు తమ లేఖలో పేర్కొన్నారు.
ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నట్టు లేఖ విడుదల చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సమాజానికి ఒక శాపంగా పరిగణించబడాలి. దానిని సమూలంగా అంతం చేయడానికి అందరూ ఐక్యంగా పనిచేయాలన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా శాంతి, సామరస్యం,మానవతా విలువలను కాపాడటానికి కట్టుబడి ఉంటుదన్నారు. ఈ దాడి వెనుక ఉన్న దోషులను న్యాయం ముందు తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులను నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలను అధికారులు తీసుకోవాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe