అపర సంజీవని.. అల్ల నేరేడు

నల్లగా నిగనిగగా మెరుస్తూ వగరు, తీపి, పులుపు మేళవింపు రుచులతో ఉండే అల్ల నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Last Updated : Jul 18, 2018, 04:19 PM IST
అపర సంజీవని.. అల్ల నేరేడు

నల్లగా నిగనిగగా మెరుస్తూ వగరు, తీపి, పులుపు మేళవింపు రుచులతో ఉండే అల్ల నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చూడటానికి బొటనవేలు మధ్యవేలు మధ్య పట్టేంత సైజులో ఉంటాయే గానీ.. దెబ్బకు షుగర్ పారా హుషార్!  హిందీలో జామూన్, సంస్కృతంలో జంబూ అంటారు దీన్ని. సంవత్సరం పొడవునా దొరికే నేరేడు.. ఆరోగ్యానికి అమృతం వంటిది. పండును బాగా కడిగి, శుభ్రం చేసి తినాలి. మోతాదుగా తినాలి (రోజుకో మూడు నాలుగు).

రామాయణంలో శ్రీరాముడు పద్నాలుగేళ్ళు వనవాసం చేసినపుడు, ఎక్కువ భాగం ఈ పండ్లతోనే కాలం గడిపాడని భారతీయుల విశ్వాసం. అందుకనే భారతదేశంలోని గుజరాత్ మరియు వివిధ ప్రాంతాల్లో దీనిని దేవతా ఫలంగా భావిస్తారు. ఆయుర్వేదంలో ఈ పండును అపర సంజీవనిగా పిలుస్తారు. ఈ పండులో విటమిన్‌ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి.

నేరేడు పండు మాత్రమే కాక ఆకులు, గింజలు, చెట్టు బెరడు కూడా ఔషధాల తయారీలో వాడుతారు. ఈ అల్లనేరేడు చెట్టు కాయల నుండి వెనిగర్‌ను తయారు చేస్తారు. జ్ఞాపకశక్తి మెరుగుపరుచుకోవాలంటే నేరేడు పండ్లు తినమని పరిశోధకులు సూచిస్తున్నారు.

  • నేరేడు పండ్లు మధుమేహ బాధితులకు దివ్యౌషధం. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీళ్లలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.
  • నోటిపూత, చిగుళ్ల వ్యాధులు, దంతక్షయం ఉన్నవారు నేరేడు ఆకుల రసాన్ని రోజూ పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • జిగట విరేచనాలతో బాధపడే వారికి  2-3 చెంచాల నేరేడు పండ్ల రసాన్ని ఇస్తే విరేచనాలు తగ్గుతాయి.
  • పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.
  • జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
  • మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి.
  • కడుపులో ఉండే మలినాలను, పొరబాటున మింగిన వెంట్రుకలను నేరేడు పండ్లు కరిగించి బయటకు పంపిస్తాయి.
  • ఈ పండ్లు జీర్ణశక్తిని పెంచడంలో తోడ్పడతాయి.

Trending News