)
SLBC Tunnel Project: 'కృష్ణాలో మన వాటా మనం తీసుకోకపోవడం వల్ల ఆ నీటిని ఆంధ్రా తరలించుకు పోతోంది. మన వాటా మనకు దక్కాల్సిందేనని ట్రిబ్యునల్లో దీనిపై మేం వాదనలు వినిపిస్తూ ఒక కొలిక్కి తీసుకొస్తున్నాం. ఇంత తక్కువ ఖర్చుతో 30 టీఎంసీలు తీసుకు వెళ్లే ప్రాజెక్టు ఎక్కడా లేదు. మేం అధికారంలోకి వచ్చాక పనులు మొదలుపెట్టాం' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. దురదృష్టవశాత్తు 8 మంది కార్మికులు చనిపోయారు. మాకు బాధ ఉన్నా ఆ కుటుంబాలను ఆదుకుని పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం' అని తెలిపారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులపై సోమవారం సమీక్ష చేసిన రేవంత్ రెడ్డి అనంతరం మన్నెవారిపల్లిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. '30 టీఎంసీల తరలింపు, 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 1983 లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మంజూరైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో వైఎస్సార్ టన్నెల్-1, 2 పనులను ప్రారంభించారు. రూ.1,968 కోట్లతో టెండర్లు ఇచ్చారు. టన్నెల్ బోర్ మిషన్తో దేశంలోనే తొలిసారి ఎస్ఎల్బీసీ టన్నెల్కు ఉపయోగించారు. 2014 వరకు కి.మీ టన్నెల్ పనులు పూర్తయ్యాయి' అని రేవంత్ రెడ్డి వివరించారు.
'గ్రావిటీ ద్వారా నల్గొండకు నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రపంచంలో 40 కి.మీ టన్నెల్ ఎక్కడా లేదు. ఇది పూర్తయితే తెలంగాణకు ఆ రికార్డు దక్కుతుంది. ఆనాడు 2 వేల కోట్లు ఖర్చుతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది. ఇప్పుడు పెరిగిన అంచనాలతో రూ.4,600 కోట్లతో ఈ టన్నెల్ను పూర్తి చేయొచ్చు' అని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడమే కాదు.. కృష్ణా నదిపై ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని గత ప్రభుత్వాలను రేవత్ రెడ్డి తప్పుబట్టారు.
'ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆర్మీలో ఉన్న పరిచయాలతో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. తప్పులు చేసి అప్పులు చేసి దోపిడీ చేశారనే ప్రజలు మిమ్మల్ని పక్కనబెట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఇక్కడి ప్రజలు మమ్మల్ని క్షమించరు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముంపునకు గురవుతున్న మర్లపాడు, కేశ్య తండా, నక్కలగండి తండా ప్రజలను ఆదుకుని, డిసెంబర్ 31లోగా సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది' అని స్పష్టం చేశారు. ఇప్పుడు కాకపోతే ఈ ప్రాజెక్టును ఇంకెప్పుడూ పూర్తి చేసుకోలేమని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగొంచుకుని ప్రాజెక్టు పూర్తి చేసుకుందామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోకపోతే నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి