
Hyderabad Musi River Floods: నిత్యం వేలాది ప్రయాణికులతో రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ ఆవరణలోకి మూసీ నది వరద చుట్టుముట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రవాహ తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్సులను అక్కడి నుంచి వేరేచోటకు పంపించారు. తాత్కాలికంగా బస్సులను లోనికి అనుమతించడం లేదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మూసీ వరద ఎంజీబీఎస్లోకి వచ్చిన సమయంలో సుమారు మూడు వేల మంది ప్రయాణికులు బస్టాండ్లో ఉన్నారనిసమాచారం. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్ పెద్ద బస్టాండ్ కు వచ్చే బస్సులను దారి మళ్లించినట్లు వివరించారు. ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు దిల్సుఖ్నగర్ వరకే అనుమతించారు. కర్నూలు, మహబూబ్నగర్ నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్ వరకే నడిపేలా చర్యలు చేపట్టారు. వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులు JBS నుంచి నడుపుతున్నారు.
మూసీకి ఒకేసారి 35 వేల క్యూసెక్కుల వరద రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈసీ, మూసీకి వరద తాకిడి పెరగడంతో జలమండలి అధికారులు అప్రమత్తమై ఉస్మాన్సాగర్ 12, హిమాయత్సాగర్ 9 గేట్లను ఎత్తి 35 వేల క్యూసెక్కులకు పైగా నీరు మూసీ నదిలోకి విడుదల చేశారు. ఒకేసారి అంత పెద్ద మొత్తంలో నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, కాలనీలు నీట మునిగాయి. ఈ ప్రభావం బాపూఘాట్ నుంచి మూసారాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది.
మూసానగర్, రసూల్పురా, వినాయక వీధి, శంకర్నగర్లలో వందల ఇళ్లు నీట మునిగాయి. మూసారాంబాగ్ బ్రిడ్జి సమీపంలోని అంబేడ్కర్ నగర్ బస్తీ, మూసానగర్, రసూల్పురా, వినాయక వీధి, శంకర్నగర్లలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఊహించని విధంగా రాత్రి వేళలో వచ్చిన ప్రవాహ తాకిడికి కుటుంబాలు అల్లాడిపోయాయి. నిత్యావసరాలు, ఇతర సామన్లు తడిచిపోయాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు వాపోతున్నారు.
మూసీ వరదల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘాట్, ముసారాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. వంతెనపై స్లాబ్ వేసేందుకు ఏర్పాటు చేసిన ఇనుప సెంట్రిగ్ భారీ శబ్ధాలతో కొట్టుకుపోయింది. సుమారు కోటిన్నర నష్టం వాటిల్లిందని వంతెన నిర్మాణ సంస్థ తెలిపింది. రంగారెడ్డిలో కురిసిన కుండపోత వానలకు మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు నీట మునిగాయి. లోతట్టు కాలనీల ఇళ్లలోకి వరద చేరింది. ఫలితంగా స్థానికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.