
Hyderabad Ganesh Immersion: గణేశ్ విగ్రహాల ప్రధాన నిమజ్జనం ప్రశాంతంగా ముగిసినట్లు సీవీ ఆనంద్ ప్రకటించారు. హైదరాబాద్ గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు. మూడో రోజు నుంచి 11వ రోజు వరకు మొత్తం 1,40,000 గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఇందులో 1,20,000 విగ్రహాలు బేబీ పాండ్స్, ఇతర చిన్న చెరువుల్లో నిమజ్జనమయ్యాయని చెప్పారు. అయితే ఆన్లైన్ ప్రక్రియ ద్వారా హైదరాబాద్ నగరంలో 12,030 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని వెల్లడించారు.
ప్రధాన నిమజ్జనానికి ముందు రోజుల్లో 7,330 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని.. మిగతావి 4,700 విగ్రహాలు ప్రధాన నిమజ్జనంలో నిమజ్జనం కావాల్సి ఉందని తెలిపారు. అయితే వాటిలో ఇప్పటికీ 900 విగ్రహాలు నెక్లెస్ రోడ్డులో నిమజ్జనం కోసం ఉన్నాయని వెల్లడించారు. గణేశ్ నిమజ్జన శోభాయాత్ర దాదాపు 40 గంటల పాటు కొనసాగిందని సీవీ ఆనంద్ చెప్పారు. ఈసారి కొన్ని విగ్రహాల ఎత్తు 40 అడుగుల కంటే ఎక్కువగా ఉండడంతో శోభాయాత్ర కొంత ఆలస్యమైందని పేర్కొన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేయడానికి పోలీసులు రెండు రోజులు నిద్ర లేకుండా పనిచేశారని.. 9 డ్రోన్లు, 35 హై రైజ్ భవనాలపై కెమెరాలను ఉపయోగించి నిఘా పెట్టామని కమిషనర్ వెల్లడించారు.
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల సహకారంతో నిమజ్జనం ముందుగానే పూర్తయ్యిందని సీవీ ఆనంద్ ప్రకటించారు. సెంట్రల్ జోన్ పోలీసులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీఏ, హెచ్ఎండీఏ వంటి వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయంతో నిమజ్జనం విజయవంతమైందని కమిషనర్ తెలిపారు. నిమజ్జన ఊరేగింపులో చిన్నపాటి గొడవలకు సంబంధించి 5 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 170 మందిని, పిక్ పాకెటింగ్ కేసుల్లో మరికొందరిని పోలీసులు పట్టుకున్నట్లు వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి నేరాల సంఖ్య తగ్గిందని కమిషనర్ తెలిపారు.
గణేశ్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఇంకా కొనసాగుతోందని.. ట్రాఫిక్ మళ్లింపులను పూర్తిగా తొలగించినప్పుడే నిమజ్జనం పూర్తయినట్లుగా భావిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. మండప నిర్వాహకులు ఆలస్యంగా నిమజ్జనానికి బయలుదేరినా అన్ని విగ్రహాలను హుస్సేన్ సాగర్కు పంపించినట్లు చెప్పారు. ఇప్పుడు సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనాన్ని కొనసాగిస్తామని వివరించారు. హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం శాంతియుత వాతావరణంలో ప్రజలకు, గణేశ్ ఉత్సవ సమితి వారికి, మండప నిర్వాహకులకు ధన్యవాదాలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ విక్రమ్ సింగ్ మాన్, ఐపీఎస్, పోలీస్ అధికారులు విశ్వప్రసాద్, జోయల్ డెవిస్, శ్వేతా శిల్పావల్లి, రక్షిత కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.