)
Osmania University: 'తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివి' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఇది గుర్తుచేశారు. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు ఈ యూనివర్సిటీ విద్యార్థులే అని చెప్పారు. తెలంగాణ నలుమూలలా ఏ సమస్య వచ్చినా మొదట చర్చ జరిగేది యూనివర్సిటీలోనే అని పేర్కొన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోమవారం హాస్టల్ భవనాలను ప్రారంభించిన అనంతరం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'చదువుతోపాటు పోరాటాన్ని నేర్పించే గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది ఉస్మానియా యూనివర్సిటీ. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారిది ఉస్మానియా యూనివర్సిటీనే. యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర సాధనలో సమిధలయ్యారు' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
'ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని మేం ఆలోచన చేశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. చదువుకుని చైతన్యం ఉన్న వారిని వీసీలుగా నియమించాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచే మేధా సంపత్తిని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆశిస్తున్నామని పేర్కొన్నారు. దేశానికి యువ నాయకత్వం అవసరమని గుర్తుచేశారు.
'యువతను గంజాయి, డ్రగ్స్ వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయి. గంజాయి, డ్రగ్స్ యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. ఆ వ్యసనాల నుంచి యువతను బయటపడేలా చేయాలి. చదువు, చైతన్యం ఉంటేనే సమాజంలో రాణిస్తారు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'నా దగ్గర పంచడానికి భూములు లేవు, ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే. మీ తలరాతలు మార్చేది చదువొక్కటే' అని పేర్కొన్నారు. చదువు ఒక్కటే మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది, గుణవంతులను చేస్తుందని చెప్పారు.
'పేదరికాన్ని పారదోలడం మాకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు. యూనివర్సిటీ అభివృద్ధి అధ్యయనానికి ఇంజనీర్స్ కమిటీ వేయాలని అధికారులను ఆదేశిస్తున్నా. ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్ ఫర్డ్, ఆక్స్ ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతాం' అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రకు నిలువెత్తు సాక్షిగా నిలవాలని ఆకాంక్షించారు. ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని ప్రకటించారు. యూనివర్సిటీ అభివృద్ధికి ఏం కావాలో అడగండి.. అంచనాలు తయారు చేసి ఇవ్వండి అన సూచించారు. మళ్లీ యూనివర్సిటీకి వస్తా… ఆర్ట్స్ కాలేజీ వద్ద మీటింగ్ పెట్టి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు.
'కోదండరామ్పై కుట్ర చేసి సుప్రీం కోర్టుకు వెళ్లి పదవి తొలగించారు. ఇదేం పైశాచిక ఆనందం. మళ్లీ కోదండరామ్కు ఎమ్మెల్సీ ఇస్తాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 'సెంట్రల్ యూనివర్సిటీలో సింహాలు, ఏనుగులు ఉన్నాయని ప్రచారం చేసి అడ్డుకున్నారు. తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేనేలేవు' అని మరోసారి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసే బాధ్యత తనదని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.