
Matrimony Scam: పెళ్లీల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లు వేదికగా నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని పెళ్లి చేసుకుంటానంటూ డబ్బును కాజేసినట్లు గుర్తించారు. నిందితుడిపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో 24 కేసులున్నాయి. రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోకుండా మోసాలకు పాల్పడి మళ్లీ కటకటాలపాలయ్యాడు.
నిందితుడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరిగా గుర్తించారు.పలు మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో యానాంకు చెందిన ఎమ్మెల్యే ఫొటోతో వంశీకృష్ణ వివరాలు నమోదు చేశాడు. తాను ఎన్నారై, వ్యాపారి, ఐటీ ఉద్యోగినంటూ రెండో వివాహం,మూడు పదుల వయసు దాటిన వారే లక్ష్యంగా వల విసిరేవాడు.
తన తల్లి అమెరికాలో డాక్టర్ అని, తాను స్థానికంగా ఉంటూ వ్యాపారం చేస్తుంటానని నమ్మబలికేవాడు. అమెరికా నుంచి అమ్మ రాగానే పెళ్లి చేసుకుందామంటూ నమ్మించేవాడు. ఇటీవల జూబ్లీహిల్స్కు చెందిన ఒక వైద్యురాలికి మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా నిందితుడు పరిచయమై, అత్యవసర ఖర్చులంటూ రూ. 10.94లక్షలు రూపాయలు తీసుకొని ముఖం చాటేశాడు. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే నగ్న వీడియోలు తయారు చేయించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో బెంగళూరులో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe