యూపీలో ఎస్పీ - బీఎస్పీ కూటమి విచ్ఛిన్నమైంది. ఎస్పీతో బీఎస్పీ తెగదెంపులు చేసుకుంది. ఈ మేరకు బీఎస్పీ చీఫ్ మాయవతి ప్రకటించారు. యూపీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ఎస్పీ వైఖరే కారణమని ఆమె ఆరోపించారు. యాదవ ఓట్లు తమకు బదిలీ కాకపోవడం వల్ల తాము అనేక చోట్ల సీట్లు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఈ పరిణామంతో ఎస్పీ-బీఎస్పీ పొత్తుకు అర్థం లేకుండా పోయిందని మాయ పేర్కొన్నారు. కుటమిగా ఏర్పడినప్పుడు పార్టీలు నమ్మకంతో పనిచేసినప్పుడే గెలుపు సాధించగలం..నమ్మకం లేనప్పుడు కలిసి పనిచేయడం అర్థరహితమన్నారు.
ఇక నుంచి ఒంటరి పోరే..
అసెంబ్లీ ఎన్నికలతో సహా భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో బీఎస్పీ ఒంటిగానే పోటీ చేస్తుందని మాయవతి స్పష్టం చేశారు. ఓటమిపై పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాయవతి పేర్కొన్నారు.
ఎన్నికల్లో కూటమి ఘోర వైఫల్యం
లోక్ సభ ఎన్నికలకు ముందు ఎస్పీ - బీఎస్పీ మహాకూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఈ కూటమికి వస్తాయని అందరూ భావించారు. తీరా ఫలితాలు మాత్రం అంత ఆశాజనకంగా రాలేదు. ఈ కూటమి మొత్తంలో 80 స్థానాల్లో 15 స్థానాలకే పరిమితమైంది. ఇందులో ఎస్పీ 5 స్థానాలు మాత్రమే దక్కించుకోగా ..బీఎస్పీకి 10 సీట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ల బదిలీ జరగలేదనే కారణంతో ఆగ్రహించిన బీఎస్పీ చీఫ్ మాయావతి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.