
Karnataka: కర్ణాటక కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కొన్ని పథకాల్లో ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయించింది. ముస్లింలకు ప్రత్యేక కోటా మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు, మంత్రులు సమర్థిస్తున్నారు.
కర్ణాటకలో ప్రభుత్వం తలపెట్టిన గృహ నిర్మాణ పథకాల్లో ముస్లింలకు ప్రత్యేక కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న 10 శాతం రిజర్వేషన్లను 15 శాతానికి పెంచుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలు అమలు చేసే హౌసింగ్ పథకాలకు ఈ 15 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. మైనార్టీ వర్గాలకు ప్రస్తుతం 10 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. త్వరలో వీటిని 15 శాతానికి పెంచనున్నారు. జనాభాని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. పట్టణ జనాభాలో ఎక్కువ మంది మైనార్టీలు, పేదలు ఉన్నారంటూ ఆయన ఈ రిజర్వేషన్లను సమర్థించారు. అందుకే ముస్లింల కోటాను 10 శాతం నుంచి 15 శాతం చేశామన్నారు. మైనార్టీల నుంచి చాలా కాలంగా ఈ డిమాండ్ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మైనార్టీలకు 15 శాతం కేటాయింపులు చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.
కర్ణాటక ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత బిల్లు 2025ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం 2 కోట్ల కంటే తక్కువ విలువ చేసే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్రంలోని విపక్ష బీజేపీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మతం ఆధారంగా టెండర్లలో రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ప్రధాని మోదీ కూడా ఆరోపణలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook