భువనేశ్వర్: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఒడిషా పర్యటనలో వుండగా సంబల్పూర్ వద్ద ఆయన హెలీక్యాప్టర్ని తనిఖీ చేసిన జనరల్ అబ్జర్వర్ని సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రక్షణ అందిస్తున్న వారికి తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుందనే విషయాన్ని విస్మరించి తనిఖీ చేయడంతో ప్రధాని నరేంద్ర మోదీ అనుకోకుండా అక్కడే 15 నిమిషాలపాటు ఆగిపోవాల్సి వచ్చిందని, అందువల్లే ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
1996 కర్ణాటక బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ మహ్మద్ మోహ్సిన్ మంగళవారం ప్రధాని చాపర్ని తనిఖీ చేయగా బుధవారం రాత్రి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ఎన్నికల సంఘం నుంచి ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. అదే రోజున రూర్కెలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఒడిషా ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్ నేత నవీన్ పట్నాయక్ చాపర్ని సైతం ఎన్నికల సంఘానికి చెందిన ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందం తనిఖీ చేసిన సంగతి తెలిసిందే.