సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అత్యంత సంపన్నుడిగా అభ్యర్ధిగా రమేశ్కుమార్ శర్మ రికార్డు సృష్టించారు. ఇతని ఆస్తుల విలువ ఏకంగా రూ.1,107 కోట్లు. ఈ విషయాన్ని ఆయనే తన ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈయన ఏడో దశ ఎన్నికల్లో భాగంగా బిహార్లోని పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
రమేశ్కుమార్ శర్మ ఆస్తులకు సంబంధించిన విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదికలో బహిర్గతం చేసింది. ఏడో దశలో బరిలో నిలిచిన 918 మంది అభ్యర్థుల్లో 909 మంది అభ్యర్థుల ప్రమాణపత్రాలను విశ్లేషించిన అనంతరం ఏడీఆర్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ఏడీఆర్ నివేదిక ప్రకారం ఏడో దశలో పోటీ చేసిన అభ్యర్ధుల్లో 31 శాతం మంది ( 278 మంది అభ్యర్ధులు) కోటీశ్వరులు పోటీచేస్తుండగా అభ్యర్థుల సగటు ఆస్తి రూ.4.61 కోట్లుగా ఉంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తున్న సంపన్న అభ్యర్థుల్లో (ఏడు దశల్లోనూ) రమేశ్కుమార్దే తొలిస్థానం కావడం విశేషం.