ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ పార్థివదేహాన్ని నిజాముద్దీన్ ఈస్ట్లోని ఆమె నివాసం నుంచి ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని పార్టీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి ఇంకొద్దిసేపట్లో భారీ జన సందోహం మధ్య షీలా దీక్షిత్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీజేపి అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చీఫ్ సోనియా గాంధీతోపాటు కాంగ్రెస్, వివిధ పార్టీల అగ్రనేతలు షీలా దీక్షిత్ అంతిమయాత్రలో పాల్గొంటారని తెలుస్తోంది. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో మధ్యాహ్నం 2.30 గంటలకు షీలా దీక్షిత్ అంత్యక్రియలు జరగనున్నాయి.