Ujjwala Yojana: దేశ ప్రజలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కొత్తగా ఫ్రీగా ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కొత్తగా 25లక్షల కనెక్షన్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. తాజాగా ఇచ్చే 25లక్షల కొత్త కనెక్షన్లతో దేశంలో ఉజ్వల లబ్దిదారుల సంఖ్య 10.60 కోట్లకు చేరుకుంటుందని కేంద్రం వెల్లడించింది. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇది కూడా ఒకటని తెలిపింది.
1/6దసరా, నవరాత్రి ఉత్సవాల సందర్బంగా మోదీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద అదనంగా 25 లక్షల కొత్త ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
2/6దేశంలో మహిళల గౌరవం, సాధికారతకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే ప్రాధాన్యతకు ఇది మరో ఉదాహరణ అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. మహిళలను దుర్గాదేవిలా గౌరవించే భారతీయ సంస్కృతిని ఈ పథకం ప్రతిబింబిస్తుంది. పొగలేని వంటగదులు సృష్టించడం ద్వారా మహిళల ఆరోగ్యం, జీవన ప్రమాణం మెరుగుపడింది అని ఆయన పేర్కొన్నారు.
3/6కొత్తగా అందించే ప్రతి కనెక్షన్పై కేంద్రం సుమారు రూ. 2,050 ఖర్చు చేస్తోందని మంత్రి వివరించారు. ఈ ఖర్చులో గ్యాస్ సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్, సురక్షా హోస్ పైపు, డీజీసీసీ బుక్లెట్, ఇన్స్టాలేషన్ చార్జీలు అన్ని కలుస్తాయి. అదనంగా, ఉజ్వల 2.0 పథకం కింద లబ్ధిదారులకు మొదటి రిఫిల్ సిలిండర్ మరియు స్టవ్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
4/6అదేవిధంగా, గత నెలలో కేంద్ర మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 10.33 కోట్ల ఉజ్వల కుటుంబాలకు ఒక్కో సిలిండర్పై రూ.300 సబ్సిడీ అందుతోందని అన్నారు. దీంతో లబ్ధిదారులకు సిలిండర్ కేవలం రూ. 553కే లభిస్తోందని వెల్లడించారు. ఇది ప్రపంచంలోని అనేక ఎల్పీజీ ఉత్పత్తి చేసే దేశాలతో పోలిస్తే భారత్లోనే అత్యల్ప ధర అని ఆయన పేర్కొన్నారు.
5/6ప్రధానమంత్రి ఉజ్వల యోజనను కేంద్రం 2016 మేలో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు అందించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇళ్లలో పొగతో నిండిన వంటగదుల నుంచి మహిళలకు విముక్తి లభించడం ఈ పథకం ప్రధాన విజయంగా నిలిచింది. ఆరోగ్య సమస్యలు తగ్గడంతో పాటు, మహిళల సమయం, శక్తి కూడా ఆదా అవుతోందని మంత్రి పూరీ వివరించారు.
6/6ఉజ్వల పథకం కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదు, ఇది సామాజిక విప్లవం. పొగలేని వంటగదులు సృష్టించడం ద్వారా కోట్లాది మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. మహిళల ముఖాలపై ఆనందం, ఆరోగ్యం కనిపించడం మాకు సంతృప్తి కలిగిస్తోంది అని మంత్రి అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయానికి దేశ ప్రజలు ప్రత్యేకంగా మహిళలు ధన్యవాదాలు తెలుపుతున్నారని పేర్కొన్నారు.