Big Gift To Telangana Govt Employees On September 2nd: కమిటీలు, చర్చలు అంటూ తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగులు పోరాటానికి సిద్ధమయ్యారు. త్వరలో పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమవగా ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 2వ తేదీన భారీ శుభవార్త రాబోతుందని చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1/6అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించలేదు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఒక్కటీ పరిష్కరించలేదు. ఐదు డీఏలు పెండింగ్, వేతన సవరణ సంఘం, జీతాల పెంపు, మెడికల్ బిల్స్తో సహా అన్నీ బిల్లులు బకాయిపడడం, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక చెల్లింపులు చేయలేదు. ఇవన్నీ సమస్యలు పరిష్కరించకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పింఛన్దారులు కూడా ఆందోళనకు సిద్ధమయ్యారు.
2/6అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు సెప్టెంబర్ 2వ తేదీన తీపి కబురు అందించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2వ తేదీన మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానుండడంతో ఉద్యోగ వర్గాల్లో భారీ ఆశలు రేకెత్తుతున్నాయి. దసరా ముందు సమావేశం కావడంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
3/6ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై సెప్టెంబర్ 2వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులకు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. సమావేశం ఆహ్వానం రావడంతో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశాభావంలో ఉన్నారు.
4/6కొన్ని నెలలుగా కమిటీలు, చర్చలు అంటూ తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు బస్సు యాత్రకు సిద్ధమవగా మంత్రివర్గ ఉప సంఘంతోపాటు అధికారుల కమిటీ సభ్యులు ఉద్యోగుల డిమాండ్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
5/6ఉద్యోగుల అంశాలపై గురువారం మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ భట్టి విక్రమార్క, సభ్యుడు పొన్నం ప్రభాకర్, అధికారుల కమిటీ సభ్యులు లోకేశ్కుమార్, కృష్ణ భాస్కర్, సీనియర్ ఐఏఎస్ అధికారులు మహేశ్దత్ ఎక్కా, సందీప్కుమార్ సుల్తానియా, రఘునందన్రావు చర్చించారు.
6/6మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో ఉద్యోగ సంఘాలను కూడా భాగం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి రావాలంటూ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు, ఇతర సంఘాల ప్రతినిధులకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. మరి ఈ సమావేశంలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు ప్రకటిస్తుందోనని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాయి.